బంకులను యథావిధిగా తెరిచి ఉంచాలి
త్వరలో జిల్లాకు సరిపోను నిల్వలు దిగుమతి
సెల్ కాన్ఫరెన్స్లో నల్లగొండ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ, జూన్ 15 : జిల్లా వ్యాప్తంగా అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ను వినియోగదారులకు విక్రయించాలని.. బ్లాక్ చేసినా లేదంటే బంకులు మూసివేసినా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బంక్ యజమాన్యాన్ని హెచ్చరించారు. బుధవారం సివిల్ సప్లయ్ అధికారులతో కలిసి ఆర్డీఓలు, తాసీల్దార్లు, డిప్యూటీ తాసీల్దార్లతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. చిన్న, చిన్న కారణాల మూలంగా బంకుల్లో పెట్రోలియం నిల్వల పాక్షిక కొరత ఏర్పడిందని త్వరలో ఆ సమస్య లేకుండా చూసుకుంటామని అన్నారు. జిల్లాలో 215 బంకులు ఉండగా ఆయా బంకుల్లో 228 కిలోలీటర్ల పెట్రోల్, 371 కిలో లీటర్ల డీజిల్ ఉన్నట్లు తెలిపారు. ఆయిల్ కంపెనీల వద్ద 125 ఇండెంట్స్ ఉన్నందున స్టాక్ జిల్లాకు పంపమని రాష్ట్ర పౌర సరఫరాల అధికారులతో మాట్లాడామన్నారు. ఆర్డీఓలు సేల్స్ ఆఫీసర్లతో మాట్లాడి పెట్రోల్, డీజిల్ తెప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాన్ఫరెన్స్ డీఎస్ఓ వెంకటేశ్వర్లు, ఏఎస్ఓ నిత్యానంద్, డీఆర్వో జగదీశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
సోషల్ మీడియా పుకార్లు నమొద్దు : తాసీల్దార్ కృష్ణారెడ్డి
చిట్యాల: పెట్రోల్ బంక్ల్లో డీజిల్, పెట్రోల్ స్టాక్ లేదని సోషల్ మీడియా ద్వారా వచ్చే పుకార్లను వాహనదారులు నమ్మొద్దని తాసీల్దార్ కృష్ణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని పెట్రోల్ బంకుల యజమానులతో మాట్లాడి పెట్రోల్ నిల్వలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.