సూర్యాపేట, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాలో మరిన్ని మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న మీ సేవ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 75 శాతం మీ సేవ కేంద్రాలు సరిగ్గా నడువడం లేదు. పనులు లేక నిర్వాహకులు నష్టాల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు మరిన్ని మీ సేవ కేంద్రాలు రావడంతో వారి జీవనోపాధికి కష్టమేనని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
సూర్యాపేట జిల్లాలోని 84 మీ సేవ కేంద్రాల్లో 50 కేంద్రాలు ప్రస్తుతం అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. ఆదాయం లేక నష్టాలపాలవుతున్నాయి. కొన్ని కేంద్రాలకు నెలకు రూ.10వేల ఆదాయం కూడా రావడం లేదని సమాచారం. ప్రతి మీసేవ కేంద్రంలో రెండు కంప్యూటర్లు, కలర్, బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్లు, స్కానర్, ఫర్నిచర్ తదితరాల కోసం దాదాపు రెండు లక్షల రూపాయల వరకు వెచ్చించారు. ఇంత చేస్తే యజమానితోపాటు మరో ఆపరేటర్ను కూడా బతికించలేని పరిస్థితి. దాంతో చాలా వరకు కుటుంబంలోనే ఉన్న మరో వ్యక్తికి శిక్షణ ఇచ్చి పనులు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో మీసేవ కేంద్రం ఏర్పాటు కోసం అప్పులు చేసి భరించలేక ఆత్మహత్యలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే నడువని మీ సేవ కేంద్రాలు ఉండగా, కొత్తగా ఏర్పాటు చేయడానికి అంత అవసరం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిబంధనల మేరకు కొత్త మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలంటే ఇప్పటికే ఉన్న మీ సేవ కేంద్రానికి 500 మీటర్ల దూరంలో ఇవ్వకూడదు. గతంలో కొత్త మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్ వెలువడడంతో పలువురు కోర్టుకు వెళ్లడంతో నాడు అవి ఆగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కొన్ని కొత్త మీ సేవ సెంటర్లకు నోటిఫికేషన్ వెలువడగా అవన్నీ దాదాపు నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నట్లు తెలుస్తుంది. మరి కొత్త నోటిఫికేషన్ అమలు జరిగేనా లేక ఆగేనా అనేది మరికొద్ది రోజుల్లో తేలనున్నది. ఇదిలా ఉంటే కొత్తవి ఇవ్వకుండా అంతంత మాత్రంగా నడుస్తున్న మీ సేవ కేంద్రాలను మార్చుకునే అవకాశం కల్పించాలని పలువురు నిర్వాహకులు కోరుతున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే పనులు ఆన్లైన్ ద్వారా చేపడుతున్నప్పటి నుంచి ప్రజలకు సేవలు సత్వరమే అందేందుకు సర్కారు మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ తదితర పనులకు సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను ప్రభుత్వం నిర్ణయించే చార్జీలతో చేపడుతున్నారు. ఇలా సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం 84 మీ సేవ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా చాలా మీ సేవ కేంద్రాలను నిబంధనలు పాటించకుండా అధికారుల ప్రోద్బలంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చుకున్నట్లు సమాచారం. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న మీసేవ కేంద్రాల ఆదాయం భారీగా పడిపోయిందని పలువురు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.