నీలగిరి, జూన్ 27: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా పోలీసు శాఖ సంయుక్తంగా మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 2కే రన్ను కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్ ఫ్రీ నల్గొండ -డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో సమాజంలో మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒకరూ భాగస్వాములు కావాలన్నారు. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును, కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ప్రతి విద్యార్థి తన జీవిత లక్ష్యంపై దృష్టి సారించాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు.
మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా సమాజ శాంతిభద్రతలకు కూడా ముప్పుగా మారుతుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిని కేవీ కృష్ణవేణి ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి, నవీన్, సునీల్, సీఐ నాగరాజు, ఎస్ఐలు సైదాబాబు, శివప్రసాద్, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.