నీలగిరి, ఫిబ్రవరి 15 : రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు హుందాతనాన్ని మరిచి అసెంబ్లీని రచ్చబండలా, పిట్టల సభగా మార్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత దూషణలు చేస్తూ సమయం వృథా చేస్తున్నారన్నారు. కృష్ణా జలాలను కేంద్రానికి అప్పగించడమంటే మన హక్కులను వదులుకోవడమేనని, దానిపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశాన్ని కార్పొరేట్ వర్గాలకు అప్పజెప్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ నేడు జరిగే గ్రామీణ సడక్ భారత్ బంద్కు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల్లో పూర్తిగా అన్యాయం చేస్తున్నారని, 2015లో శంకుస్థాపన చేసిన చర్లగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పూర్తి నష్టపరిహారం కూడా ఇవ్వలేదని అన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, డబ్బికార్ మల్లేశ్, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, పాలడుగు ప్రభావతి, కందాల ప్రమీల, లక్ష్మీనారాయణ, సత్తయ్య పాల్గొన్నారు.