సూర్యాపేట రూరల్, జూన్ 8 : పిల్లలమర్రి గ్రామంలోని సుబ్బ సముద్రం చెరువుపై మినీ ట్యాంక్ బండ్ నిర్మిస్తామని, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి పట్టణ పరిధిలోని పిల్లలమర్రిలో రాత్రి సుబ్బసముద్రం చెరువు కట్టమీద జరిగిన చెరువుల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్బ సముద్రం చెరువులోని జలాలకు గంగా హారతి ఇచ్చిన మంత్రి పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రెండేండ్ల వ్యవధిలో సుబ్బ సముద్రం నీరు మంచి నీటి వినియోగానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామన్నారు. మూసీ మురికి నీరు నుంచి బయట పడేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. లక్ష కోట్ల వ్యయంతో నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్టులు నిర్మించి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన చరిత్ర తెలంగాణదే అన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో వ్యవసాయం, విద్యుత్, నీటి పారుదల, విద్య, వైద్యం, ఫ్రెండ్లీ పోలీసింగ్ తదితర రంగాల్లో విజయాలను మననం చేసుకునేందుకే ఉత్సవాలను జరుపుకుంటున్నామన్నారు.
అటువంటి అద్భుతమైన విజయాలను అందించిన సీఎం కేసీఆర్కు ఈ నేల ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, నీటి పారుదల అధికారులు రమేశ్బాబు, భద్రూనాయక్, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, కౌన్సిలర్లు బచ్చలకూరి శ్రీను, రాపర్తి శ్రీనివాస్గౌడ్, తాహేర్, అభినయ్ పాల్గొన్నారు.
పెన్పహాడ్ : ఊరూర చెరువుల పండుగ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మాచారం రాయి చెరువు వద్ద కట్ట మైసమ్మకు మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 380 కిలో మీటర్ల దూరం నుంచి ఇక్కడికి చేరుకున్న కాళేశ్వరం జలాలతో రైతులు మూడు పంటలు సాగు చేసుకుంటూ రాజుగా తలెత్తుకుని జీవించడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో ఊరూరా చెరువులు, కుంటలు నిండడంతో మత్స్య కార్మికులకు జీవనోపాధితో సంతోషంగా ఉన్నారన్నారు.
ఏనాడూ మూసీ నీటితో రెండు పంటలకు సాగు నీరు అందించని గత పాలకులు గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుసటి సంవత్సరానికే రూ.20కోట్లతో ప్రాజెక్ట్కు మరమ్మతులు చేపట్టి ఇప్పటి వరకు వరుసగా 16 పంటలకు నీరు అందించి రైతులను ఆదుకున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య, సర్పంచ్లు బైరెడ్డి శ్రీనివాస్రెడ్డి, బొల్లక సైదమ్మ, బొబ్బయ్య, అనిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీటీసీ మామిడి రేవతి, నీటిపారుదల శాఖ అధికారులు రమేశ్బాబు, భద్రూనాయక్, ప్రత్యేకాధికారి రాంపతి, దంతాల వెంకటేశ్వర్లు, పేరం మధు, పొదిల నాగార్జున, మామిడి అంజయ్య, తాసీల్దార్లు శేషగిరిరావు, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ నరేశ్ పాల్గొన్నారు.