యాదాద్రి భువనగిరి, మార్చి 27 (నమస్తే తెలంగాణ)/బీబీనగర్ : బీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా రూపొందించాలని
రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గులాబీ జెండా అంటేనే విపక్షాల గుండెల్లో గుబులు రేకెత్తించేలా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం బీబీనగర్ మండల కేంద్రంలో
నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ శ్రేణులు, సంక్షేమ
పథకాల లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉచిత విద్యుత్ సహా
సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీని ఉకిరిబికిరి చేస్తున్నాయన్నారు. యావత్
భారతదేశం నుంచి తెలంగాణకు తరలివచ్చిన రైతులు, రైతు సంఘాల ప్రతినిధుల ఒత్తిడి మేరకే బీఆర్ఎస్ పార్టీకి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.
దేశంలో ఒక్క తెలంగాణ మినహా అన్ని రాష్ర్టాల్లో ఆకలి చావులు ఉన్నాయని, మోదీ ప్రధాని అయ్యాక ఇవి మరింత పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయడం లేదని మండిపడ్డారు. గుజరాత్లో రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, రైతులకు ఉచిత కరంట్ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు, ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర సంక్షేమ పథకాలు అమలు చేసి ఏ రాష్ర్టానికి అందనంత ఎత్తులో తెలంగాణ వెలుగొందుతున్నదని తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించాకే రాష్ట్రంలో ప్రగతి ప్రారంభమైందని, సీఎం కేసీఆర్ దార్శనికత, పట్టుదలతో ఇది సాధ్యమైందని చెప్పారు.
కేంద్ర మంత్రులు, ఇతర రాష్ర్టాల మంత్రులు, ప్రతినిధులు రాష్ర్టానికి వచ్చి ప్రశంసించకుండా వెళ్లడం లేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కనీసం తాగడానికి మంచినీరు దిక్కులేదని, ఫ్లోరిన్ నీళ్లు తాగి రోగాలపాలయ్యారని వాపోయారు. బీఆర్ఎస్ పాలనలో తాగు, సాగునీరు అందించడంతో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదని సాక్షాత్తు పార్లమెంట్లో కేంద్రమంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. అభివృద్ధికి మూలం గులాబీ జెండానే.. ‘గులాబీ పార్టీ లేకుంటే వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ వచ్చి ఉండేదా? వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా రైతు బంధు పథకం అమల్లోకి వచ్చేదా? కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరుతో ఇంత పారదర్శకంగా ఆడపిల్లల పెండ్లిళ్లకు ఆర్థిక సహాయం అందేదా? వేసవిలో కుళాయిల వద్ద ఎలాంటి గలాటా లేకుండా ఇంటింటికీ మంచినీరు వచ్చేదా? అంతెందుకు చెరువుల్లో ఉట్టి పడుతున్న జలకళకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న మిషన్ కాకతీయ పథకం కారణం కాదా’ అని మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు.
ఇంతటి అభివృద్ధికి గులాబీ పార్టీయే మూలం అనే సూత్రీకరణను విస్మరించరాదన్నారు. గులాబీ జెండా లేనిదే రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలయ్యేవి కాదని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో చర్చ జరుగాలని తెలిపారు. 2014కు ముందు ఇవన్నీ ఉండేవా.. లేదా అన్న చర్చ తెరమీదికి వచ్చినప్పుడు గులాబీ జెండా, కేసీఆర్ ప్రాధాన్యత జన బాహుళ్యంలోకి వెళ్తుందన్నారు. ఆ తరహాలో పార్టీ పటిష్టతకు గ్రామ సభలతో సరిసమానంగా పార్టీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
దేశంలోని ప్రజలు తెలంగాణ మోడల్ కావాలని కోరుకుంటున్నారని, పక్క రాష్ర్టాల ప్రజలు బీఆర్ఎస్ బలంగా కావాలంటున్నారని తెలిపారు. తెలంగాణ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ఆయా రాష్ర్టాల్లో రైతులు తిరుగుబాటు చేస్తున్నారన్నారు. కేసీఆర్ వస్తే అన్ని పథకాలు అమలవుతాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇలాంటి సమయంలో మోదీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితిలో లేదని, ప్రతిపక్షమే లేని సమయంలో బీఆర్ఎస్ రావడాన్ని బీజేపీ, మోదీ జీర్ణించుకోలేపోతున్నాయని విమర్శించారు. కేసీఆర్ను చూస్తే బీజేపీకి, మోదీకి వణుకు పుడుతున్నదని, అందుకే తెలంగాణపై కుట్రలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలమైన కేసీఆర్ను నిలువరించలేక ఆయన కుటుంబంపై బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో ఆశించిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. 14 ఏండ్ల పాటు బీఆర్ఎస్ కొట్లాడిందే అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసమని, ఇప్పుడు ఆ సంకల్పం నెరవేరిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను మరింత విస్తరించాలని, తద్వారా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ బ్రహ్మాండంగా గెలువాలని సూచించారు. గతంలో ఐదేండ్లలో చేయని అభివృద్ధిని ఇప్పుడు ఏడాదిలోనే చేస్తున్నారని స్వయంగా కాంగ్రెస్ నేతలు అంటున్నారని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయని, ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్నన్ని పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. సమష్టి నిర్ణయాలతో పార్టీని మరింత బలంగా తయారు చేయాలని, వచ్చే ఎన్నికల్లో గెలుపు బాధ్యతను అందరూ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, ఎంపీపీ యరల సుధాకర్గౌడ్, జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్రెడ్డి, నాయకులు బొక జైపాల్రెడ్డి, మెట్టు శ్రీనివాస్రెడ్డి, రాచమల్ల శ్రీనివాసులు, చింతల సుదర్శన్రెడ్డి, మంచాల రవికుమార్, గోరుకంటి బాలచందర్, చీర ఐలయ్య పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందని గడప లేదన్నారు. 2014లో బతుకమ్మలను వదలడానికి నీళ్లు లేక జేసీబీలతో తవ్వించి నీళ్లు పోసిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఎక్కడ పునాదులు తవ్వినా గంగమ్మ ఉబికి వస్తున్నదంటే ఎంత అభివృద్ధి జరిగిందో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు. సర్పంచులు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సమన్వయంతో పని చేయాలని, గ్రామాల్లో బీఆర్ఎస్ను పటిష్టం చేసి గులాబీని మరింత గుబాళింపజేయాలని సూచించారు. రాష్ట్రంలో కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని, ఆ దిశగా అందరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించాలంటే మళ్లీ బీఆర్ఎస్ రావల్సిన అవసరం ఉన్నదన్నారు. గ్రామాల్లో 80శాతం మేర పార్టీ బలంగా ఉన్నదని, ఇంకా పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు.
యాదాద్రి భువనగిరి, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు షురూ అయ్యాయి. బీబీనగర్ మండల కేంద్రంలో సోమవారం తొలి సమ్మేళనం నిర్వహించారు. ఇందులో మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కొత్త ఒరవడికి నాంది పలికారు. సమ్మేళనం ప్రారంభానికి ముందే సర్పంచులు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులతో వేదికపై మాట్లాడించారు. ఆయా గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉంది? పింఛన్లు, కల్యాణలక్ష్మి, రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ సాయం తదితర అంశాలపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో ఎంతమంది ఉన్నారు? ఆయా పథకాల్లో ఎంత మందికి లబ్ధి చేకూరింది? అనే వివరాలను రాబట్టారు. వాటి గురించి సర్పంచులు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులను వేదికపైనే వేర్వేరుగా ప్రశ్నలు అడగటంతో సభ మొత్తం వీక్షించింది. అన్ని గ్రామాల్లో 70నుంచి 80శాతం పనులు పూర్తయ్యాయని వారు సమాధానమిచ్చారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని మంత్రి సూచించడంతో వాళ్లకున్న సాధక బాధకాలను నేరుగా మంత్రికి విన్నవించారు. మంత్రి సావధానంగా విని వాటి అమలుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతకుముందు వేదికపై సాంస్కృతిక కళాకారులు చేపట్టిన ధూంధాం ఆటాపాట ఆకట్టుకున్నది.
జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని మంత్రి సూచించారు. సర్పంచులు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో నెలకోసారి సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. గ్రామాల్లో చేసిన ప్రగతి నివేదికను తెప్పించుకొని ప్రజలకు వివరించాలని చెప్పారు. తెలంగాణలో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని, ఇది అందరి కృషితోనే సాధ్యమవుతుందని అన్నారు.