మూడు ఎంపీటీసీల పరిధిలోని 11 గ్రామాలకు గురువారం చివ్వెంల మండల కేంద్రం శివారులో పచ్చని చెట్ల మధ్య నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పండుగలా జరిగింది. మంత్రి జగదీశ్రెడ్డి పిలుపుతో కుటుంబ సమేతంగా ఇంటికి తాళాలు వేసి మరీ వచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా వృద్ధులు, మహిళలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమం ఉదయం టిఫిన్తో మొదలు కాగా మధ్యాహ్నం భోజనం, మధ్యలో స్నాక్స్ అందించే ఏర్పాట్లు చేశారు. మంత్రి ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలుకరిస్తూ ఫొటోలు, సెల్ఫీలు దిగారు. ఇది ఒక వన మహోత్సవంలా జరిగిందని అక్కడికి వచ్చిన అందరూ సంతోషం వ్యక్తం చేశారు.
– సూర్యాపేట, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ)
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గులాబీ సైన్యమే పార్టీకి బలం, బలగమని.. ఆ ధైర్యం, అండతోనే తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలిపారు. గురువారం చివ్వెంలలో నిర్వహించిన బీఆర్ఎస్ మండల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అరవై ఏండ్లల్లో జరుగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలోనే చేసి చూపించారని, ఇతర రాష్ర్టాల ప్రజలు తెలంగాణ తరహా పాలన కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కుప్పిగంతులు వేసినా, చిల్లర రాజకీయాలకు పాల్పడినా ప్రజల గుండెల్లో ఉండేది బీఆర్ఎస్ పార్టేనని తెలిపారు. పేదలను దోచి కార్పొరేట్ పెద్దలకు పంచి పెట్టడమే పనిగా మోదీ పనిచేస్తున్నారని, దేశంలో దారిద్య్రం పెరిగిపోయిందని పేర్కొన్నారు. ఇంటింటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరించాలని, విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు.
– చివ్వెంల, ఏప్రిల్ 13
చివ్వెంల, ఏప్రిల్ 13 : ఓట్లు అడిగే దమ్మూ, ధైర్యం ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం పరుగులు పెట్టడం గులాబీ శ్రేణులకు ఆత్మ ైస్థెర్యాన్నిచ్చిందని పేర్కొన్నారు. చివ్వెంల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. గులాబీ శ్రేణుల త్యాగంతో ఏర్పడిన తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన నిధులు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయన్నారు. ఉద్యమంతో మొదలైన గులాబీ శ్రేణుల త్యాగం ఇప్పటికీ కొనసాగుతున్నదని తెలిపారు. పారదర్శకతకు తెలంగాణ ప్రభుత్వం పెట్టింది పేరని, లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ కావడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. 2014కు ముందు నిధులు మధ్య దళారుల జేబుల్లోకి చేరాయన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకట్లో మగ్గుతారని అవహేళన చేసిన నాయకుల చెంప చెల్లుమనిపించేలా తొమ్మిదేండ్లుగా అభివృద్ధి పరుగులు పెడుతున్నదని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలోనే అందరి కష్టాలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ అన్ని రంగాలను ఊహించని రీతిలో అభివృద్ధ్ది చేస్తుండడంతో నేడు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. అందుకే అన్ని రాష్ర్టాల ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతున్నారని తెలిపారు. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో ఆయా పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. దాంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వణుకు పుట్టి అర్థం లేని ఆరోపణలతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 24 గంటల విద్యుత్, పుష్కలంగా నీళ్లు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలు దేశం మొత్తం అమలు కావాలని అన్ని రాష్ర్టాల ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇటువంటి పథకాలేవీ లేకపోగా.. ఎన్నికల సమయంలో వారిచ్చిన హామీలను సైతం నెరవేర్చలేదని విమర్శించారు. 60 ఏండ్లలో జరుగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలోనే చేసి చూపించారని తెలిపారు. దేశం మరింత ముందుకు పోవాలంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని ఆయా రాష్ర్టాల ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, రాబోయే రోజుల్లో మరింత ముందుకు సాగాలంటే మరోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేలా పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొన్న బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు విపక్షాలు విషపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నాయని, వాటిని తిప్పి కొట్టేందుకు శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇంతకంటే ఎక్కువగా ఏం చేస్తారో నిలదీయాలని ప్రజలకు సూచించారు. 2014కు ముందు సిండికేట్ దందాలు, రౌడీ రాజకీయాలు, నిరంతర గొడవలు, కొట్లాటలతో కేసులపాలు చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన సంఘటనలు ఇక్కడి ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. విద్యుత్, నీళ్లు సరిగా లేక, పంటలు పండక ఆర్థిక ఇబ్బందులతో ఎంతో మంది వలస వెళ్లిన ఘటనలు తెలిసిందేనని పేర్కొన్నారు. నాడు దండుగ అనుకున్న వ్యవసాయం నేడు పండుగలా మారిందని, పంటలు సమృద్ధిగా పండుతున్నాయని తెలిపారు. ఇప్పుడు వలసలు ఆగి ఇతర రాష్ర్టాల నుంచి ఉపాధి కోసం మన రాష్ర్టానికి వచ్చే పరిస్థితి నెలకొన్నదన్నారు.
నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుప్పిగంతులు వేసినా, చిల్లర రాజకీయాలకు పాల్పడినా ప్రజల గుండెల్లో ఉండేది బీఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ ఫథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, సైనికుల్లా పని చేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జూలకంటి జీవన్రెడ్డి, ఎంపీపీ ధరావత్ కుమారీబాబూనాయక్, జడ్పీటీసీ భూక్యా సంజీవ్నాయక్, పీఏసీఎస్ చైర్మన్ మారినేని సుధీర్రావు, నాయకులు రౌతు నర్సింహారావు, జూలకంటి సుధాకర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.