నేరేడుచర్ల, డిసెంబర్ 1 : హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్ట వద్ద కొన్నేండ్లుగా అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.30 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం సర్వే నంబర్ 529, 540, 541, 542 లోని 50 ఎకరాల్లో రూ.150 కోట్ల అంచనాతో జీ ప్లస్-1 మోడల్ కాలనీగా 1,100 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే నిధుల కొరతతో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి.
40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. నిర్మాణం నిలిచిపోవడం లబ్ధ్దిదారుల ఎంపిక, పంపిణీ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల సమయంలో ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. హామీ మేరకు రూ. 98.51 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదన పంపారు. స్పందించిన మంత్రి కేటీఆర్ గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఫోన్ చేసి నిధులు మంజూరు చేయాలని తెలుపగా మొదటి విడుతగా రూ. 30 కోట్లు మంజూరు చేశారు. మిగిలిన నిధులు సైతం త్వరలోనే మం జూరు కానున్నాయి. నిర్మాణాలు పూర్తయితే నిరుపేదల నివాసానికి అడ్డంకులు తొలగిపోనున్నాయి.
అర్హులందరికీ గృహాలు మంజూరు
అసంపూర్తిగా మిగిలిపోయిన ఇండ్ల మరమ్మతు త్వరగా పూర్తి చేసి అర్హులైన పేదలకు అందజేస్తాం. రాజకీయాలకు అతీతంగా అర్హులను గుర్తించి మొదటి ప్రాధాన్యత కింద వారికి గృహాలు అందజేస్తాం. గృహాల మరమ్మతులకు రూ. 98.51 కోట్లు కావాలని సీఎం కేసీఆర్, మంత్రుల దృష్టికి తీసుకువెళ్లగా స్పందించి ప్రాథమికంగా రూ. 30 కోట్ల నిధుల మంజూరుకు జీఓ జారీ చేశారు.
– శానంపూడి సైదిరెడ్డి, హుజూర్నగర్ ఎమ్మెల్యే