ఏటికేడు అంతరించిపోతున్న అటవీ సంపద.. కాలుష్యం పెరిగి పశుపక్ష్యాదులతోపాటు మానవ మనుగడ కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి సంవత్సరం మొక్కలు నాటించి సంరక్షణ చర్యలు చేపట్టడంతో అవి పెరిగి పచ్చదనం పంచుతున్నాయి. తొమ్మిదేండ్లలో ఎనిమిది విడుతలు పూర్తి కాగా లక్షల మొక్కలు నాటుకున్నాయి. గ్రామాలు, పట్టణాలు, రహదారులు, వీధులు, చెరువులు, కాల్వ గట్లతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు హరిత శోభ సంతరించుకున్నాయి. పల్లె, పట్టణ ప్రకృతి వనాలతోపాటు చిట్టడవులను నిర్మించడంతో ప్రజలకు ఆహ్లాద వాతావరణం అందుతున్నది. ఏటా వర్షాలు సకాలంలో కురువడానికి హరితహారం ఫలితమేనని స్పష్టమవుతున్నది. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సోమవారం జిల్లాలో హరితోత్సవం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా భారీ ఎత్తున మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు.
– నల్లగొండ సిటీ, జూన్ 12
సూర్యాపేట, జూన్ 18 : పర్యావరణ పరిరక్షణ, రాష్ట్రంలో అటవీ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పెంచుతున్నారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు, ప్రతి ఊరిలో ప్రకృతి వనం, మండలానికి మెగా పార్కులు, పట్టణానికి బృహత్ పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గడిచిన ఎనిమిదేండ్లలో సుమారు 4.50 కోట్ల మొక్కలు నాటారు. అన్ని శాఖల సమన్వయంతో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించే విధంగా చర్యలు చేట్టారు. జిల్లాలో గుండా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటారు.
జిల్లా వ్యాప్తంగా 516 నర్సరీలు
హరితహారం కార్యక్రమంలో నాటేందుకు వీలుగా అవసరమైన మొక్కల కోసం ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేశారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో, మున్సిపాల్టీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి ఆ గ్రామ అవసరాలకు తగిన మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం 475 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఉండగా 5 మున్సిపాల్టీల్లో 27 నర్సరీలు ఉన్నాయి. వీటికి తోడు అటవీశాఖ ఆధ్వర్యంలో 14 నర్సరీలు ఉన్నాయి. వీటిలో జిల్లాకు కావాల్సిన 22 రకాలకు చెందిన 72 లక్షల మొక్కలు పెంచుతున్నాయి.
679 పల్లె ప్రకృతి వనాలు
జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలతో పాటు సుమారు 679 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 10 లక్షల మొక్కలు నాటారు. ప్రతి మండలంలో 5 చొప్పున ఐదు ఎకరాల స్థలంలో మెగా ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి సుమారు 20 వేల మొక్కలు నాటారు. సూర్యాపేట జిల్లాలో 80మెగా పల్లె ప్రకృతి వనాలు మంజూరుకాగా ఇప్పటి 33 పూర్తి చేశారు.
113 పట్టణ ప్రకృతి వనాలు
జిల్లాలోని 5 మున్సిపాల్టీల పరిధిలో 141 వార్డులు ఉండగా 113 వార్డుల్లో పట్టణ ప్రకృతి వనాలు ఉన్నాయి. వీటిలో సూర్యాపేట మున్సిపాల్టీలో 48 వార్డులకు 49 వనాలు, కోదాడలో 35 వార్డులకు 27, హుజూర్నగర్ 28 వార్డులకు 14, నేరేడుచర్ల 15 వార్డులకు 11, తిరుమలగిరిలో 15 వార్డులకు 12 పట్టణ ప్రకృతి వనాలు ఉన్నాయి. దాంతో పాటు సూర్యాపేట మున్సిపాల్టీలో హరితహారం కింద మూడు చిట్టడవులను పెంచుతున్నారు. ఒక్కో పట్టణ ప్రకృతి వనంలో దాదాపు 2500 మొక్కలు నాటారు. 5 మున్సిపాల్టీల్లో బృహత్ పట్టణ ప్రకృతి వనాలు పెంచాలని నిర్ణయించగా.. ఇప్పటికే స్థలాలను గుర్తించి పనులు ప్రారభించారు.
కాల్వల వెంట 20 లక్షల మొక్కలు
జిల్లాలోని ఇరిగేషన్ కాల్వల వెంట పల్లె ప్రకృతి వనాలు, మెగా పల్లే ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని మూసీ, ఎస్సారెస్పీ, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ వెంట 80 శాతం బౌండరీలను గుర్తించారు. దాదాపు 800 ఎకరాల స్థలంలో 350 పల్లె ప్రకృతి వనాలు, 130 మెగా పల్లే ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లోని ఇరిగేషన్ భూముల్లో సుమారు 20 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా జిల్లా అధికారులు పనిచేస్తున్నారు.
అటవీశాఖ ఆధ్వర్యంలో
అటవీశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారికి ఇరువైపులా మూడు వరసల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేట్టారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 55 వేల మొక్కలు నాటారు. దాంతో పాటు సూర్యాపేట – జనగాం, ఖమ్మం- సూర్యాపేట, కోదాడ -మిర్యాలగూడ రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎతున్న చేపట్టారు. దాంతో పాటు ఉండ్రుగొండ అటవీ ప్రాంతంలో 900 ఎకరాల్లో 70 వేల మొక్కలతో అర్బన్ పార్క్ను అభివృద్ధి చేశారు.
మొక్కల సంరక్షణకు పక్కాగా ఏర్పాట్లు
ప్రతి సంవత్సరం జూన్లో వర్షాలు కురియగానే హరితహారంలో మొక్కలు నాటి తర్వాత ప్రతి రోజూ ట్యాంకర్ల ద్వారా నీరు పోసి సంరక్షించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను అందించారు. మున్సిపాలిటీల్లో సైతం నీటి ట్యాంకర్లు కొనుగోలు చేసి వాటి ద్వారా మొక్కలకు నీటిని అందిస్తున్నారు.