రేషన్ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ప్రతి నెలా అందించే రేషన్ కమీషన్ను రెండింతలు పెంచింది. క్వింటాకు రూ.70 ఉన్న కమీషన్ను రూ.140 ఇస్తామని ప్రకటించింది. మంగళవారం రేషన్ డీలర్లతో జరిపిన చర్చల అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ విషయం వెల్లడించారు. ప్రతి డీలర్కు హెల్త్ కార్డుతోపాటు కరోనా సమయంలో చనిపోయిన డీలర్ల స్థానంలో వారి వారసులకు డీలర్ షిప్ ఇవ్వనున్నట్లు తెలిపారు. పెంచిన కమీషన్ ఇదే నెల నుంచి ఇస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో 2,165 రేషన్ డీలర్లు ఉండగా అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ, ఆగస్టు 8: రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రేషన్ డీలర్ల విన్నపాలు స్వీకరించి వారికి ఇచ్చే కమీషన్ను పెంచుతూనే ఉంది. ఈ తొమ్మిదేండ్ల కాలంలో ఏడు సార్లు కమీషన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కార్ ఈ సారి ప్రతి రేషన్ డీలర్ కుటుంబానికి ఆరోగ్య బీమా సౌకర్యం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చింది. 2014లో టన్నుకు రూ.200 కమీషన్ ఉండగా ఏదో దఫా వచ్చే సరికే ఆ కమీషన్ టన్నుకు రూ.1400 కు చేరింది. ఈ సారి కమీషన్ పెంపు, ఉచిత బీమాతో పాటు కరోనా సమయంలో చనిపోయిన రేషన్ డీలర్ల స్థ్దానంలో వారి వారసులకు డీలర్షిప్ ఇస్తామని ప్రకటించగా ఆ కారణంతో జిల్లాలో 11 మంది డీలర్లు చనిపోయా రు. వీరందరి స్థ్దానంలో వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికీ డీలర్ షిప్ ఇస్తామని మంత్రులు హరీశ్రావు, కమలాకర్ తెలిపారు. నల్లగొండ జిల్లాలో 991, సూర్యాపేట 623,యాదాద్రి భువనగిరి జిల్లాలో 551 రేషన్ దుకాణాలు ఉన్నాయి.
నల్లగొండ జిల్లాలో ప్రతి నెలా 6,667 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా..
నల్లగొండ జిల్లాలో మొత్తం 991 రేషన్ దుకాణాలు ఉండగా ఆయా దుకాణాల పరిధిలో 4.67 లక్షల ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. ఆయా కార్డుల ద్వారా ప్రతి నెల 66 670 క్వింటాల్ల బియ్యం సివిల్ సప్లయ శాఖ ద్వారా రేషన్ దుకాణాలకు సరఫరా అవుతున్నాయి. ప్రతి నెలా 5వ తేదీ నుంచి 15 లోపు ఈ రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. అయితే ప్రభుత్వం రేషన్ డీలర్లు దుకాణాల ద్వారా ప్రజలకు ఈ భియ్యం సరఫరా చేసింనందుకు ప్రతి క్వింటాకు రూ.70 కమీషన్ ఇస్తుంది. ఈ కమీషన్ సరిపోవడం లేదని దాన్ని రూ.140కి పెంచాలని డీలర్లు ప్రభుత్వాన్ని కోరా రు. దాంతో మంగళవారం ఆర్థ్దిక శాఖ మంత్రి హరీశ్రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాక ఆధ్వర్యంలో చర్చలు జరపగా డీలర్ల కోరిక మేరకు క్వింటాకు రూ.140 ఇస్తామని ప్రకటించడంతో డీలర్లు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
కమీషన్ డబుల్ చేయడం సంతోషంగా ఉంది
తెలంగాణ వచ్చే నాటికి టన్నుకు రూ.200 ఉన్న కమీషన్ను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రూ.1400కు పెంచింది. ఇప్పటి వరకు క్వింటాకు రూ.70 కమీషన్ ఉండగా దాన్ని ఒకే సారి రూ.140కు పెంచడం సంతోషం. దాంతో పాటు ఉచితంగా హెల్త్ బీమా సౌకర్యం కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే కరోనా సమయంలో జిల్లాలో 11 మంది రేషన్ డీలర్లు చనిపోగా వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినందుకు కృతజ్ఞతలు.
-వైద్యుల సత్యనారాయణ, రేషన్ డీలర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, నల్లగొండ