యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 22 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారిని సుమారు 9వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. వివిధ విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానాకు రూ.13,44,832 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. ఉచిత వైద్యశిబిరం… యాదగిరిగుట్టలో స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పీహెచ్సీ వైద్యులు వంశీకృష్ణ, హరీశ్ ఆధ్వర్యంలో కొండపైన బస్టాండ్ వద్ద, కొండకింద కల్యాణకట్ట వద్ద ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు.