రామగిరి, ఏప్రిల్ 17: శ్రీరామ నవమిని వేడుకలు ప్రజలు బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రామగిరిలో గల సీతారామచంద్రస్వామి ఆలయంలో కల్యాణ వేడుకకు భక్తులు పోటెత్తడంతో రామనామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది.
దేవాదాయ, ధర్మాదాయ శాఖ తరుపున కలెక్టర్ దాసరి హరిచందన తమ నివాసలో పూజలు చేసి అక్కడ నుంచి అర్చక స్వాముల మంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాల మధ్య ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్ర్తాలను అందజేశారు. ఆలయాల్లో కల్యాణోత్సవం అనంతరం అన్నదానం నిర్వహించారు.
రామగిరి సీతారామచంద్ర స్వామి ఆలయంలో నిర్వహించిన కల్యాణోత్సవంలోరాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమా టోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, పలువురు కౌన్సిలర్లు, ఉమ్మడి జిల్లా దేవాదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేందర్కుమార్, అధికారులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నల్లగొండ లోని సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం రాత్రి 7గంటలకు గరుడ వాహన సేవ, శుక్రవారం సాయంత్రం 6గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు.
కొండమల్లేపల్లి : మండల కేంద్రంలోని చౌరస్తాలో గల సీతారామచంద్రమౌళీశ్వర ఆలయంలో స్వామి వారి కల్యాణ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీలు దూదిపాల వేణుధర్రెడ్డి, న ల్లగాసు జాన్ యాదవ్, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆల్లంపల్లి నర్సింహ పాల్గొన్నారు.
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలోని అభయాంజనేయస్వామి, శివాలయాల్లో స్వామివార్లను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ దర్శించుకున్నారు. సీతారాముల కల్యాణమహోత్సవంలో పాల్గొన్నారు.
మిర్యాలగూడ : స్థానిక రెడ్డికాలనీలోగల కోదండరామాలయంలో బుధవారం సీతారాముల కల్యాణాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని వేలాదిమంది భక్తులు హాజరై తిలకించారు. కార్యక్రమంలో చెరుకుపల్లి కిరణ్, దివ్వేది ప్రవీణ్, రామాచారి, ఆలయ అధ్యక్షుడు పాదూరు ఇంద్రసేనారెడ్డి, పుట్ట దయాకర్రెడ్డి పాల్గొన్నారు.
హాలియా : మండలంలోని అనుముల, హాలియా, కొత్తపల్లి, చల్మారెడ్డిగూడెం, హజారిగూడెం, నాయుడుపాలెం, రామడుగు, తదితర గ్రామాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హాలియాలో జరిగిన సీతారాముల కల్యాణాన్ని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి సందర్శించి స్వామివారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ యడవెల్లి అనుపమా నరేందర్రెడ్డి, ఎంపీపీ సుమతీపురుషోత్తం పాల్గొన్నారు.
తిరుమలగిరి(సాగర్) : మండలంలోని చిల్కాపురం ఆలయంలో సీతారాముల స్వామివారి కల్యాణోత్సవానికి ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఎమ్మెల్సీ కోటిరెడ్డిని శాలువాతో సన్మానించింది. కార్యక్రమంలో అనుముల ఎంపీపీ సుమతీపురుషోత్తం, మాజీ ఎంపీపీ అల్లిపెద్ది రాజుయాదవ్,భక్తులు పాల్గొన్నారు.
గుర్రంపోడ్ : మండలంలోని వద్దిరెడ్డిగూడెం, పిట్టలగూడెం గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఆయన వెంట స్థానిక నాయకులు పాల్గొన్నారు.