– నల్లగొండ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర
నీలగిరి, ఏప్రిల్ 10 : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు, ట్రేడ్ లైసెన్సులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర తెలిపారు. నగర అభివృద్ధికి అవసరమైన ఆదాయ వనరులను బలోపేతం చేయడం అత్యంత అవసరమన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నగరంలోని వ్యాపారులు, ఆస్తి యజమానులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు తమ బాధ్యతలను సమయానికి నిర్వర్తించాలని కోరారు. ట్రేడ్ లైసెన్సుల విషయమై నగరంలోని అన్ని వ్యాపార సంస్థలు, వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్సుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లైసెన్సులను తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని ఆదేశించారు. ట్రేడ్ లైసెన్సులు లేకుండా వ్యాపారం నిర్వహించడం చట్ట విరుద్ధమని, అటువంటి వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన హెచ్చరించారు.
అలాగే ఆస్తి పన్ను విషయంలో ప్రభుత్వం ప్రకటించిన 5 శాతం రిబేట్ అవకాశాన్ని వినియోగించుకుని, నగరంలోని అన్ని ఆస్తి యజమానులు తమ పన్ను బకాయిలను తక్షణమే చెల్లించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఆస్తి పన్ను చెల్లిస్తున్న సీనియర్ సిటిజన్లకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, అందరూ తమ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు గడ్డం శ్రీనివాస్, నంద్యాల ప్రదీప్ రెడ్డి, ఆర్వో శివరామిరెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.