పాలకవీడు, జనవరి12 : ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే జాన్పహాడ్ దర్గా ఉర్సుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. గురువారం మండలంలోని జాన్పహాడ్ దర్గాలో ఉత్సవాలకు ఏర్పాట్లను ట్రైనీ ఎస్పీ రాజేశ్మీనన్తో కలిసి పర్యవేక్షించారు. నేరేడుచర్ల-జాన్పహాడ్, దామరచర్ల-జాన్పహాడ్ రహదారుల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పార్కింగ్ ప్రదేశాలను, జాన్పహాడ్ దర్గాలో రహదారులను పరిశీలించారు.
సఫాయి బావి, చందల్ ఖానాతోపాటు దర్గా లోపలి ప్రదేశాలను పరిశీలించారు. దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా బారికేడ్లను ఏర్పాటు చేయాలని, క్యూలైన్ అమలు చేయాలని ఆదేశించారు. మహంకాళీగూడెంలోని పుష్కరఘాట్ను పరిశీలించారు. ఉర్సుకు వచ్చే భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించనున్నందున పుష్కరఘాట్ వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. జాన్పహాడ్ ఉర్సు విజయవంతానికి పోలీస్ శాఖ అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటుందని, 500 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేపడుతామని చెప్పారు. అంతకుముందు దర్గా ముజావర్ జాని ఎస్పీకి సంప్రదాయ స్వాగతం పలికారు. సైదులు బాబా సమాధులపై ఎస్పీ చాదర్ కప్పి ప్రార్థనలు చేశారు. ఆయన వెంట జిల్లా ట్రైనీ ఎస్పీ రాజేశ్ మీనన్, కోదాడ డీఎస్పీ ప్రకాశ్, హుజుర్నగర్ సీఐ రామలింగారెడ్డి, పాలకవీడు ఎస్ఐ లింగయ్య ఉన్నారు.