సూర్యాపేట సిటీ, డిసెంబర్ 27 : తెల్లవారుజామున చలి తీవ్రత, మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఈ సమయంలో వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్, సంబంధిత అధికారులు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ అనేది పౌరుల సామాజిక బాధ్యతగా గుర్తించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు జంక్షన్ల వద్ద లైటింగ్ పెంచాలని, హైవేపై నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, రహదారి వెంట గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. వాహనాల లైటింగ్ కండిషన్లో ఉండాలని, మంచు ఎక్కువగా ఉంటే హెడ్లైట్ తక్కువ ఎత్తులో ఉంచాలని, వాహనాలను తక్కువ వేగంతో నడపాలని, డ్రైవింగ్ సమయంలో పాటలు, మ్యూజిక్ పెట్టుకోవద్దని, ఇతర వాహనదారులు చేసే హారన్ శబ్దాలను గమనించాలని తెలిపారు.
రహదారిపై వాహనాన్ని నిర్దిష్టమైన మార్గంలో నడపాలని, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగేలా లైన్క్రాస్ చేయొద్దని పేర్కొన్నారు. లైన్ క్రాస్ చేసేటప్పడు, మూలమలుపులు తిరిగేటప్పుడు వెనుక ఉన్న వాహనదారులకు అర్థమయ్యేలా ఇండికేటర్ వేయాలని సూచించారు. వాహనాల గ్లాస్పై తేమ, నీటి బిందువులు లేకుండా చూసుకోవాలని, ఓవర్ టేక్ చేయవద్దని, వాహనాల మధ్య దూరం పాటించాలని తెలిపారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ముందు, వెనుక వాహనాలను, బాటసారుల ను, పశువులను గమనించాలని సూచించారు.