సూర్యాపేట సిటీ, జనవరి 18 : రేషన్ బియ్యం సరఫరా, పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ అక్రమ రవాణాను అరికట్టేందుకు సంబంధిత అధికారుల సమన్వయంతో నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. బియ్యం అందించే మిల్లర్లపై, అంతర్రాష్ట్ర రవాణాపై నిఘా ఉన్నదని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరడానికి రేషన్ డీలర్లు, మిల్లర్లు బాధ్యతగా పని చేయాలని సూచించారు.
రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు సమాచారం ఉన్నదన్నారు. అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రేషన్ డీలర్లు, మిల్లర్లపై, అంతర్రాష్ట్ర సరిహద్దు, పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించినా, ప్రజల ఆహార భద్రతకు భంగం కలిగించినా పీడీ యాక్టు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.