సూర్యాపేట సిటీ, డిసెంబర్ 29 : రాష్ట్రంలో రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారికి సంబంధించి పోలీస్ శాఖ వారు వాహనాలపై విధించిన పెండింగ్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించిందని ఎస్పీ రాహుల్ హెగ్డే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రాయితీ ప్రక్రియ డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వచ్చిందని, ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకొని వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను చెల్లించాలని సూచించారు.
ఆర్టీసీ బస్సులు, తోపుడుబండ్లపై 90 శాతం, ద్విచక్ర వాహనాలపై 80 శాతం, ఆటోలు, కార్లు, జీప్లు, ట్యాక్సీలపై 60 శాతం, భారీ వాహనాలపై 50 శాతం రాయితీ ప్రకటించినట్లు తెలిపారు. జిల్లాలో 25వ తేదీ వరకు 6,08,968 ఈ-చలాన్ కేసులు పెండింగ్ ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో గత మూడ్రోజులుగా 30,600 ఈ-చలాన్ కేసులను పరిష్కరించుకున్నారని, ఇందుకుగానూ ప్రభుత్వానికి రూ.31.65 లక్షలు వచ్చినట్లు తెలిపారు.