సూర్యాపేట సిటీ, ఏప్రిల్ 11 : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట తనిఖీలు నిర్వహిస్తున్నామని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు వెంట నిఘా ఉంచామని, రామాపురం క్రాస్ రోడ్డు, మట్టపల్లి బ్రిడ్జి, దొండపాడు, పులి చింతల ప్రాజెక్టు, చింత్రియాల, బుగ్గ మాదారం వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణా అడ్డుకుంటున్నామని పేర్కొన్నారు.
ఆంధ్ర రాష్ట్ర అధికారులతో సమన్వయంతో పని చేస్తున్నామన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులకు అనుబంధంగా ఎన్హెచ్ 65పై టేకుమట్ల, భీమారం, పాత తిరుమలగిరి, వెలిశాల, మామిళ్లగూడెం, శాంతినగర్, చిల్లెపల్లి, కుంట్లపల్లి వద్ద అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. పారా మిలటరీ సిబ్బంది, ఇతర శాఖలకు చెందిన అధికారుల సహాయంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా రూ.1.71 కోట్ల నగదు, రూ.7.75 లక్షల విలువైన మద్యం, రూ.20వేల విలువైన గంజాయి, రూ. 1.14 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.86లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర వస్తువులు సీజ్ చేశామని తెలిపారు. ఎక్పైజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.75లక్షల విలువైన మద్యం సీజ్ చేశారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం రూ.4.55 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.