నల్లగొండ సిటీ, మార్చి 27 : లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లైసెన్స్డ్ తుపాకులు పొందిన నాయకులు, వ్యాపారులు, ప్రముఖులు వెంటనే ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 136 లైసెన్స్ కలిగిన ఆయుధాలు ఉన్నాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
1959 సెక్షన్ 21 ఆయుధాల చట్టం ప్రకారం లైసెన్స్ ఆయుధాలు కలిగి ఉన్నవారు వెంటనే డిపాజిట్ చేయాలని సూచించారు. అలా చేయని వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డిపాజిట్ చేసిన ఆయుధాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత తీసుకోవచ్చని తెలిపారు. జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే భద్రతా సిబ్బందికి, గార్డు డ్యూటీలో ఉన్న వారికి మినహాయింపు వర్తిస్తుందని పేర్కొన్నారు.