సూర్యాపేట రూరల్/మోతె, ఫిబ్రవరి 18 : సూర్యాపేట మండలం ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని శనివారం ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల అదే పాఠశాలకు చెందిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం బైపీసీ చదువుతున్న విద్యార్థిని డి. వైష్ణవి కళాశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగిన సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై విద్యార్థిని బంధువులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు రాస్తారోకో, ధర్నాలు చేయడంతో అధికారులు గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ గత శుక్రవారం సస్పెండ్ చేశారు. ఆ సంఘటన మరువక ముందే తాజాగా అదే గురుకుల పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఇరుగు అస్మిత(15)శనివారం ఆత్మహత్య చేసుకుంది.
సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన ఇరుగు ఆనంద్, జ్యోతి దంపతులకు ఒక్క కుమార్తె అస్మిత. ఈ నెల 10న ఇంటర్మీడియట్ విద్యార్థిని వైష్ణవి మృతి చెందడంతో విద్యార్థులు భయపడకుండా ఉండటానికి పాఠశాల, కళాశాలకు 4రోజులు (హోంసిక్) సెలవులు ప్రకటించారు. అస్మిత తండ్రి చనిపోవడంతో అస్మిత తల్లి కూలి పనులు చేసుకుంటూ హైదరాబాద్లో ఉంటున్నది. పాఠశాలకు సెలవులు ప్రకటించడంతో అస్మిత హైదరాబాద్కు వెళ్లింది. శనివారంతో సెలవులు అయిపోతున్నందున పాఠశాలకు వెళ్దామని చెప్పిన అస్మిత తల్లి తన పనులకు వెళ్లి తిరిగి వచ్చే సరికి ఇంట్లోని ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుంది.
పాఠశాలకు వెళ్లాల్సిన రోజే అస్మిత ఉరివేసుకోవడం మిస్టరీగా మారింది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వైష్ణవి రూమ్లోనే అస్మిత కూడా ఉంటుందని సమాచారం. వైష్ణవి మృతి చెందడంతో అస్మిత డిప్రెషన్కు గురైనట్లు సమాచారం. పాఠశాలకు వెళ్లాల్సి వస్తుందని అస్మిత అప్పటికప్పుడు చనిపోవాలని నిర్ణయించుకుందా, అంతకుముందే డిసైడ్ అయ్యిందా అన్న కోణంలో పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారం వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడటం విద్యార్థినులు, తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. అస్మిత మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి ఆదివారం సొంత గ్రామం బుర్కచర్లకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు సూర్యాపేట జిల్లా కేంద్ర దవాఖానలో పోస్టుమార్టం చేశారు. తల్లి జ్యోతి ఫిర్యాదు మేరకు మోతె ఎస్ఐ యాదవేందర్రెడ్డి కేసు నమోదు చేశారు. మునగాల సీఐ రామకృష్ణారెడ్డితోపాటు అధికారులు కేసు విచారణ చేపడుతున్నారు.
ఇమాంపేట బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటనలను తెలుసుకునేందుకు ఆదివారం సాయంత్రం సోషల్ వెల్ఫేర్ గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, భోజనశాల, బాలికల విశ్రాంతి గదులను అధికారులతో కలిసి పరిశీలించారు. పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపాలని, చదువుతోపాటు పిల్లలతో మమేకమై ఆటపాటలతో ఆనందింపజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల్లో మానసిక ధైర్యం పెంపొందించేందుకు సైక్రియాట్రిస్టులతో కమిటీ ఏర్పాటు చేశామని, డాక్టర్ అనిల్, సరస్వతి, జ్యోతిపద్మ, ఉమామహేశ్వరి విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తారని తెలిపారు. ఆమె వెంట జాయింట్ సెక్రటరీ అనంతలక్ష్మి, నల్లగొండ రీజినల్ కోఆర్డినేటర్ ప్రశాంతి, ఇన్చార్జి ప్రిన్సిపాల్ అరుణకుమారి, అధ్యాపకులు హైమావతి, రమాకుమారి, శ్రీలత ఉన్నారు.
ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు కొద్దికాలం వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదిక ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో అసలు ఏం జరుగుతున్నది.. విద్యార్థులు ఎందుకు ఇలా వరుస ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ప్రభుత్వం విచారణ చేపట్టాలని కోరారు. పూర్తి స్థాయిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడంతో ఇలాంటి అనేక సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేకపోతున్నదని పేర్కొన్నారు. పూర్తిస్థాయి సంక్షేమ శాఖ మంత్రి నియమించడంతోపాటు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.