నల్లగొండ, డిసెంబర్ 23 : అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం తగదని, ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు చెప్పినా పట్టించుకోరా? అని పలువురు సభ్యులు ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా పరిషత్లో చైర్మన్ బండ నరేందర్రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు అధికారులను నిలదీశారు. పాఠశాలల్లోకి వచ్చే సన్న బియ్యంలో నాణ్యత లేకపోవడంతోపాటు తక్కువగా వస్తున్నాయని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రస్తావించారు. పలు పాఠశాలల్లో తాను చేసిన తనిఖీల్లో ఈ విషయం బయటపడ్డట్లు తెలిపారు. దీనికి మద్దతుగా జడ్పీ చైర్మన్ నరేందర్రెడ్డి సైతం పాఠశాలలకు పంపే సన్న బియ్యంలో నాణ్యత లేదని, వంట చేసిన తర్వాత గంజి ఎందుకు పడుతుందని ప్రశ్నించారు. దీనిపై పలువురు సభ్యులు సైతం ఏకరువు పెట్టారు. అసలైన దివ్యాంగులకు పింఛన్ ఇవ్వకుండా అనర్హులకు ఇస్తున్నారని చైర్మన్ నరేందర్రెడ్డితోపాటు పలువురు సభ్యులు వైద్యాధికారులను నిలదీశారు.
సదరం సర్టిఫికెట్లలో మాయాజాలం జరుగుతున్నదని ఆరోపించారు. విద్యుత్ శాఖ యంత్రాంగం నిర్లక్ష్యంతో వ్యవసాయానికి పూర్తిస్థాయిలో కరెంట్ సరఫరా కావడం లేదని, ఎల్సీల పేరుతో గంటల తరబడి కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు. మర్రిగూడలో కోటి రూపాయలతో నిర్మిస్తున్న పీఆర్ రోడ్డులో నాణ్యత లేదని, అధికారులు ఎందుకు పర్యవేక్షణ చేయడం లేదని ప్రశ్నించారు. నార్కట్పల్లి – మాండ్ర మధ్య రోడ్డుకు ఎస్టిమేషన్ తక్కువగా వేయడంతో కాంట్రక్టర్లు ముందుకు రావడం లేదని, దాన్ని రీ ఎస్టిమేషన్ వేసి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. మునుగోడులోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో విద్యుత్ చోరీ జరుగుతుంటే అధికారులు ఎందుకు కేసులు నమోదు చేస్తలేరని ఎంపీపీ సభ దృష్టికి తీసుకొచ్చారు. నల్లగొండ మండలం చెన్నుగూడెంలో నలుగురు విద్యార్థులకు ఇద్దరు టీచర్లు ఉంటే రాములబండలో 24 మంది విద్యార్థులకు ఒక్క టీచర్ ఉండటమేందని, అక్కడ సర్దుబాటు చేయకుండా ఏడాది కాలంగా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని జడ్పీటీసీ నిలదీశారు.
అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి : జడ్పీ చైర్మన్
అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి సూచించారు. గత సర్వసభ్య సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ఆయన పలు శాఖల అధికారులను ప్రశ్నించారు. బియ్యం రీసైక్లింగ్ చేసినవి ఇవ్వడంతోనే నాణ్యత ఉండడం లేదని, క్వాంటిటీ కూడా తక్కువగా వస్తున్నదని, వాటిని క్షేత్రస్థాయిలో తూకం వేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు బియ్యం తీసుకెళ్లే వాహనంలోనే తూకం మిషన్ పంపిస్తే అక్కడే తూకం వేస్తారన్నారు. వేములపల్లి మండలం చిరుమర్తి, చర్లగూడెం గ్రామాల్లోని పాఠశాలలకు నిధులు వచ్చినప్పటికీ ఎందుకు పనులు చేయడం లేదని ప్రశ్నించగా, అక్కడ కాంట్రాక్టర్ లేకపోవడంతో రీ టెండర్ పిలుస్తున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతున్నదని, పిల్లలు లేని చోట టీచర్లు పని చేస్తుండగా, పిల్లలు ఉన్నచోట టీచర్లు లేరని, ఆయా ప్రాంతాల్లో సర్దుబాటు చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ అధికారులకు సూచించారు. కడపర్తి, నకిరేకల్లో తాటికల్ రోడ్లు వేయించాలని ఆర్అండ్బీ యంత్రాంగానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. సభ్యులు లేవనెత్తిన సమస్యలను త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. సమావేశంలో నాగార్జునసాగర్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు జైవీర్రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, జడ్పీటీసీలు పాల్గొన్నారు.