పెద్దవూర/ నిడమనూరు, డిసెంబర్ 25 : దట్టమైన పొగ మంచు కారణంగా జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన వారు ఐదుగురు ఉన్నారు. దీంతో పెద్దవూర మండలంలోని నిమ్మనాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెవానికుంట, పూల్య తండాల్లో విషాద ఛాయ లు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం మల్లెవాని కుంట తండాకు చెందిన రమావత్ శివకేశవులు (20) ఇంటర్ చదివి ఫ్లవర్ డెకరేషన్ నేర్చుకొని కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. సోమవారం స్వగ్రామంలో దత్తాత్రేయ స్వామి పండుగ ఉండడంతో ఆదివారం సాయత్రం పని ముగించుకొని బైక్పై ఇంటికి బయల్దేరాడు. రాత్రి సుమారు 11గంటల సమయంలో నిడమనూరు మండలం వేంపాడు స్టేజీ వద్ద దుకాణం నిర్వహిస్తున్న వేంపాడు గ్రామస్తుడు బల్గూరి సైదులు (60)ను పొగమంచు కారణంగా కనపడక ఢీకొట్టాడు. దీంతో సైదులు అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ 50 మీటర్ల దూరం వెళ్లి రోడ్డు వెంట ఉన్న దుకాణాన్ని ఢీకొని పడిపోయింది.
దీంతో శివ తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న పోలీసులు 108 వాహనంలో మిర్యాలగూడ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. హైదరాబాద్లో ఉన్న శివకేశవులు కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో తన బంధువు రమావత్ పాండు టాటా ఏస్ వాహనాన్ని తీసుకొని హుటాహుటిన బయల్దేరారు. మల్లెవానికుంటలో కొంత మంది కుటుంబ సభ్యులను దించి అదే ఆటోలో ఉమ్మడి కుటుంబానికి చెందిన ఏడుగురు మిర్యాలగూడ దవాఖానకు బయల్దేరారు. మార్గమధ్యలో నిడమనూరు మండలంలోని వేంపాడు గ్రామ శివారులోని సాయిబాబ విగ్రహం దగ్గరకు రాగానే.. ఎదురుగా వేగంగా వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ పొగ మంచుతో అదుపు తప్పి టాటా ఏస్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో శివకేశవులు పెద్దనాన్న రమావత్ ఘన్యా (40), మేనత్త మూడావత్ బుజ్జి (38), బావ దూపావత్ నాగరాజు (28), పూల్యాతండాకు చెందిన దగ్గరి బంధువు ఆటో డ్రైవర్ రమావత్ పాండు (40) అక్కడికక్కడే మృతి చెందారు. శివకేశవులు తండ్రి రమావత్ ప్రభాకర్, పెదనాన్న కొడుకు రమావత్ వినోద్, మేన మామ మూడావత్ పాలేకర్ తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని చికిత్స నిమిత్తం పోలీసులు మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలించారు. ఉమ్మడి కుటంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడంతో మల్లెవానికుంట, పూల్యతండాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. కాగా, ఆటో డ్రెవర్ పాండుకు ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతులందరూ హైదరాబాద్లో రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
టాటా ఏస్ వాహనాన్ని పెట్రోల్ ట్యాంకర్ ఢీకొనడంతో కోదాడ జడ్చర్ల హైవేపై తెల్లవారుజామున ట్రాఫిక్ స్తంభించింది. దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించే పరిస్థితి లేకపోవడంతో అప్రమత్తమైన ఎస్ఐ జె.గోపాల్రావు జేసీబీ సాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డు పక్కకు తీయించారు. ప్రమాదాలు జరుగకుండా పోలీసు సిబ్బందితో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
మల్లెవానికుంట తండాలో మృతుల కుటుంబాలను మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్ పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని రాంచందర్నాయక్ ప్రభుత్వాన్ని కోరారు.
బైక్ ప్రమాదంలో దుర్మరణం చెందిన బల్గూరి సైదులు (60)ది నిరు పేద కుటుంబం. భార్య మృతి చెందడంతో తన ముగ్గురు పిల్లలను అన్నీ తానై పెంచాడు. వేంపాడు స్టేజీ వద్ద చిరు దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి సుమారు 11గంటల సమయంలో నిద్ర లేచిన ఆయన మూత్ర విసర్జన చేసి రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సైదులు మరణ వార్త తెలిసి వేంపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరితో కలివిడిగా ఉండే సైదులు మృతి చెందడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడంతో అంత్యక్రియలు నిర్వహించారు.