నీలగిరి, అక్టోబర్ 09 : ఓటు చోర్ సంతకాల సేకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండ పట్టణంలోని 31వ వార్డులో ఓటు చోర్ పై పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గురి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. బిజెపి ఓటు చోర్ తో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని చూస్తుందని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రంలో కూడా ఓటు చోర్ కు పాల్పడిందని విమర్శించారు. రాత్రికి రాత్రి 60 లక్షల ఓట్లు నమోదు చేసిందని ఆరోపించారు. దీనిని నిరసిస్తూ ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టడం జరిగిందని తెలిపారు.
రాహుల్ గాంధీ పిలుపుమేరకు టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాల్లో ఓటు చోరిపై సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి గ్రామంలో 100కు పైగా సంతకాలు సేకరించి రాష్ట్రపతికి, ఎన్నికల కమిషన్ కు పంపడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 15 వరకు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ శ్రేణులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మనిమద్దె సుమన్, పలువురు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.