యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : యాసంగి ధాన్యం కొనుగోళ్లు, రవాణా అస్తవ్యస్తంగా నడుస్తున్నది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం రవాణాకు లారీల కొరత ఏర్పడుతున్నది. నాలుగైదు రోజులైనా లారీలు లేక పీపీసీల నుంచి ధాన్యం మిల్లులకు రవాణా నిలిపోతున్నది. హమాలీల కొరతతో రవాణా చేసిన వడ్లు సైతం దించడం లేదు. దీంతో కేంద్రాల్లో ధాన్యం రాశులు ఎక్కడికక్కడ నిలిపోతున్నాయి. ఇటీవల వర్షంతో పలు మండలాల్లో వడ్లు తడవగా.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం ఎగుమతికి కష్టాలు..
జిల్లాలో యాసంగి సీజన్లో 3.14లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారుగా 6.90లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పౌర సరఫరాల అధికారులు మాత్రం నాలుగున్నర లక్షల టన్నుల వడ్లు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందు కోసం జిల్లాలో 358 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు 230 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించారు. ఆయా మండలాల్లో రైతులు ధాన్యాన్ని సెంటర్లను తీసుకొస్తున్నారు. జిల్లాలో గురువారం వరకు 3003 మంది రైతుల నుంచి 29,520 టన్నుల వడ్లు కొన్నారు. అయితే కొన్న ధాన్యాన్ని మాత్రం రవాణా చేయడం లేదు. ధాన్యం కొని రోజులు గడుస్తున్నా అక్కడే నిలిచిపోతున్నాయి. అయి తే కొన్న వడ్లు రవాణా చేస్తేనే ఆ తర్వాత వచ్చి న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు. పాత ధాన్యం ట్రాన్స్పోర్ట్ చేయకపోవడంతో కొనుగోళ్లు కూడా సరిగా ముందుకు సాగడం లేదు.
నాలుగైదు రోజులైనా లారీలు ఏవీ?
గతంలో ధాన్యం కొనుగోలు చేస్తే ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసేది. ఇందు కోసం ఎప్పటికప్పుడు లారీలను ఏర్పాటు ఇబ్బందులు లేకుండా చూసేవారు. కానీ కాంగ్రెస్ సర్కారు హయాంలో పరిస్థితి మారింది. పలు మండలాల్లో లారీల కొరత ఏర్పడింది. ఒక్కసారి వచ్చిన లారీలు మళ్లీ రాకుండా అటే పోతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. నాలుగైదు రోజులైనా లారీలు రావడం లేదు. హమాలీల కొరత ఉండటంతో పోయిన లారీలు అక్కడే నిలిచిపోతున్నాయి. ఇక మిల్లర్లు సైతం దించుకోవడం లేదు. ఆన్లైన్ ట్రక్షీట్తో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో తాజాగా పాత పద్ధతిన కొనుగోళ్లు చేపడుతున్నారు. యాదగిరిగుట్ట మండలంలోని మైలారిగూడెంలో లారీల కొరత ఉంది. మోత్కూరు మండలంలో లారీల కొరతతో ఎగుమతులు లేక సుమారు రెండు లక్షల బస్తాల ధాన్యం రాశుల నిల్వలు పేరుకుపోయాయి. సంస్థాన్ నారాయణపురం మండలంలో లారీలు అన్లోడ్ చేయడానికి నాలుగు రోజుల సమయం పడుతున్నది. ఆత్మకూరు (ఎం) మండలంలో ధాన్యం కాంటా వేస్తున్నా లారీల కొరత ఉంది. గుండాల మండలంలో లారీల కొరతతో ఎగుమతులు నెమ్మదించాయి. బొమ్మలరామారంలో కొన్న వడ్లు తరలించడానికి మూడు రోజుల సమయం పడుతున్నది. రోజులకొద్దీ నిలిచిపోవడంతో ధాన్యం తూకం తగ్గుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతున్న లబోదిబో..
ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు వాటిని ప్రతిరోజూ ఆరబెట్టి రాత్రిపూట కుప్పలు కడుతున్నారు. ఇటీవల జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఏకంగా కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. భువనగిరి మండలంలోని హన్మపురం కొనుగోలు కేంద్రంలో వడ్లు మొలకెత్తిన ఘటనలు ఉన్నాయి. గుండాల, ఆత్మకూరు, మోత్కూరు పీపీసీలలో ఉన్న వడ్లు వర్షానికి తడిపోయాయి. ధాన్యం తడిస్తే ధాన్యం మొలకెత్తుతుందని, తడిచిన ధాన్యం కొంటారో లేదో అనే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీ-గ్రేడ్ కొంటున్నరు..
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లకు నిర్వాహలకు వివిధ కొర్రీలు పెడుతున్నారు. నాణ్యమైన ధాన్యానికి ఏ గ్రేడ్, ఆ తర్వాత ధాన్యానికి బీ-గ్రేడ్కు కొంటారు. ఏ గ్రేడ్ వడ్లకు క్వింటాల్కు రూ. 2389 ఉండగా, బీ గ్రేడ్కు రూ. 2369 చెల్లిస్తారు. అయితే రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చినా తేమ, తాలు, క్వాలిటీ లేదంటూ సాకులు చెబుతూ తక్కువకు కొంటున్నారు. అధిక శాతం సెంటర్లలో బీ-గ్రేడ్కే కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. జిల్లా లో ఇప్పటి వరకు ఏ గ్రేడ్ వడ్లు 15,513 టన్నులు, కామన్ గ్రేడ్ 14,000 టన్నులు కొన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మిల్లర్లు సిండికేట్ కావడంతో ఈ సమస్య ఉందని కర్షకులు వాపోతున్నారు. లారీల కొరతపై పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ హరిక్రష్ణను వివరణ కోరగా.. లారీల సమస్యను పరిష్కరిస్తున్నామని, ఒకటి, రెండు రోజుల్లో సమసిపోతుందని స్పష్టం చేశారు.