నల్లగొండ ప్రతినిధి, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో గడిచిన కొన్నేండ్ల మాదిరిగా ఈసారి కూడా దాదాపు పాత డిమాండ్లే మరోసారి మోక్షం కోసం ఎదురు చూస్తున్నాయి. సాధారణ బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్ ఈ సారైనా సరికొత్త మలుపు తీసుకుంటుందా అని ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పరంగా అనేక ప్రాజెక్టులు నిర్లక్ష్యం కాబడుతున్నాయన్న భావన నెలకొంది. హైదరాబాద్ – విజయవాడ హైస్పీడ్ రైలు మార్గం, బీబీనగర్-నడికుడి లైన్ డబ్లింగ్ పనులు, ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ రైళ్ల పొడిగింపు వంటి కీలక ప్రాజెక్టులతో పాటు ఇతర డిమాండ్లు కూడా ఉన్నాయి. గత ఏడాది ప్రపంచ పర్యాటక ఉత్తమ గ్రామంగా ఎంపికైన భూదాన్ పోచంపల్లిలో ఐఐహెచ్టీ ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటుతో పాటు కేంద్రీయ, నవోదయ విద్యాలయాల అప్గ్రేడేషన్ డిమాండ్లు కూడా చాలాకాలం నుంచి ఉన్నాయి.
రైల్వే పరంగా ఉమ్మడి జిల్లాలో కీలక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. ఐదు దశాబ్దాల కిందట నిర్మించిన బీబీనగర్-నడికుడి రైల్వే లైన్ను డబ్లింగ్ చేయాలని ఏండ్లుగా డిమాండ్ ఉంది. డబ్లింగ్ పూర్తయితే మరిన్ని రైళ్లు అందుబాటులోకి రావడంతో పాటు ప్రయాణ సమయం తగ్గనుంది. రెండు తెలుగు రాష్ర్టాల ఏర్పాటు అనంతరం మరో కీలక రైల్వే లైన్ ప్రధాన డిమాండ్గా మారింది. రెండు రాజధానులను కలుపుతూ సికింద్రాబాద్ – విజయవాడ మార్గంలో హైస్పీడ్ రైల్వే లైన్ కోసం రెండు రాష్ర్టాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి కాజీపేట మీదుగా ఒక మార్గం, బీబీనగర్- నల్లగొండ-మిర్యాలగూడ మీదుగా మరో రైల్వే లైన్ ఉన్నా దూరభారంతో పాటు సమయం కూడా ఎక్కువ పడుతుంది. యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని 65వ నంబర్ జాతీయ రహదారి వెంట దీన్ని నిర్మిస్తే ప్రజా, సరుకు రవాణా పరంగా గణనీయమైన మార్పులకు ఆస్కారం ఉంది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి వెంట 256 కిలోమీటర్ల మేర ఈ హైస్పీడ్ రైల్వేలైన్ నిర్మాణం అత్యవసరంగా కనిపిస్తోంది.
ఎంఎంటీఎస్ను పొడిగించేనా..?
ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు డిమాండ్ ఏండ్ల తరబడిగా పెండింగ్లో ఉంది. సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని వైభవంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో ఈ మార్గం పొడిగింపు ఎంతో ఉపయుక్తం కానుంది. ఇదే ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్-కాజీపేట రూట్లోని డబుల్ లైన్కు అదనంగా మరో లైన్ను చర్లపల్లి నుంచి రాయగిరి వరకు 34 కిలోమీటర్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. కృష్ణానది వెంట ఉన్న సిమెంట్ పరిశ్రమల కోసం ఏర్పాటు చేసిన మోటమర్రి-విష్ణుపురం రైల్వే లైన్ను డబుల్ లైన్గా మార్చడంతో పాటు ప్యాసింజర్ రైళ్లు నడుపాలని కోరుతున్నారు. ఇది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు ఎంతో ఉపయుక్తం కానుంది.
పలు ప్రాజెక్టులు సర్వే దశలోనే..
ఇప్పటికే మూడు సార్లు సర్వే నిర్వహించినా నల్లగొండ – మాచర్ల రైల్వే లైను పనులు అతీగతీ లేవు. 1997-98లో స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్గా దీన్ని మంజూరు చేసినా పట్టించుకోలేదు. ఒకటీ రెండుసార్లు నామమాత్రపు నిధులు కేటాయించి చేతులు దులుపుకొన్నారు. ఎన్నో ఏండ్లుగా రైలు కోసం ఎదురుచూస్తున్న సూర్యాపేట వాసులపై ఈ సారైనా కేంద్రం అన్న ఆశలు నెలకొన్నాయి. గతంలో ఓ సారి 170 కిలోమీటర్ల సూర్యాపేట-స్టేషన్ న్పూర్ నూతన లైన్ సర్వే కోసం రూ.25.45 లక్షలను నాటి బడ్జెట్లో కేంద్రం కేటాయించి వదిలేసింది. 100 కిలోమీటర్ల పొడవైన నల్లగొండ-సూర్యాపేట-ఖమ్మం లైనుకు కూడా గతంలో రూ.600 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి వదిలేసింది. దీనిపై పలుమార్లు మంత్రి జగదీశ్రెడ్డి, అప్పటి ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ప్రస్తుత ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ రైల్వే మంత్రులు, అధికారులను కలిసి విన్నవించారు.
పోచంపల్లి ఐఐహెచ్టీపై ఆశలు
దేశంలోనే ఇక్కత్ వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కానీ ఐఐహెచ్టీతోపాటు చేనేతపై జీఎస్టీ తగ్గించే విషయంలోనూ కేంద్రం సానుకూలత చూపడం లేదు. దీనిపైనా ఈ బడ్జెట్లో ఏమైనా ప్రకటన వస్తుందేమోనన్న ఆశలు జిల్లా ప్రజల్లో నెలకొన్నాయి. ఇక జిల్లాకో సైనిక్ స్కూల్, కేంద్రీయ, నవోదయ విద్యాలయాల అప్గ్రేడేషన్, బీబీనగర్ ఎయిమ్స్కు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు, మూసీ ఆధునీకరణ వంటి వాటి కోసం కేంద్ర బడ్జెట్ వైపు ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
సరైన కేటాయింపులు లేకపోతే నిలదీస్తా
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తారన్న ఆశాభావం ఉంది. బీబీనగర్-నడికుడి రైలు మార్గంలోనూ డబ్లింగ్ పనులతో పాటు విష్ణుపురం- జగ్గయ్యపేట రైల్వే మార్గంలో ప్యాసింజర్ రైలు, హైదరాబాద్- విజయవాడ హైస్పీడ్ రైలు మార్గంతో పాటు ఎంఎంటీఎస్ పొడిగింపు, ఇతర రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయించాల్సి ఉంది. వీటి కోసం ఏండ్ల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. వీటితో పాటు పోచంపల్లిలో ఐఐహెచ్టీ, సైనిక్ స్కూల్, ఎయిమ్స్కు నిధుల కేటాయింపు వంటివి జిల్లాకు అవసరం. వీటన్నింటిపైనా కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. లేకుంటే వాటి సాధన కోసం కేంద్రప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం.
సూర్యాపేట జిల్లాలో ఆగని రైళ్లు
సూర్యాపేట జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారులకు ఏండ్లు గడుస్తున్నా సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సర్వీసు రోడ్లతో పాటు అవసరమున్న చోట అండర్ పాస్లు, ఫ్లై ఓవర్లు నిర్మించాలని జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి పలుమార్లు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు.ప్రమాదాలు, కోల్పోయిన ప్రాణాల సంఖ్యలతో సహా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ పార్లమెంట్ జీరో హవర్లో లేవనెత్తారు. ఈ విషయమై కేంద్ర మంత్రులకు పలు మార్లు విన్నవించారు. అయినా కనీసం స్పందించలేదు. అలాగే నల్లగొండ జిల్లా చిట్యాల నుంచి జగ్గయ్యపేట వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందని, హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి వెంట బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ మంత్రికి పలు మార్లు విన్నవించారు. వాడపల్లి నుంచి జగ్గయ్యపేట వరకు రైల్వే గూడ్స్ బండ్లు నడుస్తున్నాయి.
అక్కడ ప్యాసింజర్ నడిపితే మోటమర్రి జంక్షన్ నుంచి ఖమ్మం, విజయవాడకు ప్రయాణాలు అనుకూలంగా మారుతాయని, ఉమ్మడి జిల్లాలోని తిరుపతి ప్రయాణికుల కోసం గుంటూరులో నారాయణాద్రి కోచ్ ఉన్నట్లు నల్లగొండకు ఒక కోచ్ ఏర్పాటు చేయాలని కోరినా ఫలితం లేకపోయింది. నల్లగొండ, మిర్యాలగూడల్లో కనీసం అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును ఒక్కో నిమిషం ఆపాలని, తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలుకు భువనగిరిలో స్టాప్ పెట్టాలని రైల్వే మంత్రికి ఎంపీ బడుగుల ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయం, పాస్పోర్టు సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరినా స్పందన కరువైంది.