సమాజానికి ఎందరో మేధావులను అందించిన సర్కారు పాఠశాలలు ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కరువై కునారిల్లుతూ వచ్చాయి. ఉపాధ్యాయుల్లేక, వసతుల లేమితో విద్యార్థులు రాక అనేక స్కూళ్లు మూతపడ్డాయి. కొత్త తరం వారికి చదువు మరింత దూరమైంది. ఆ దుర్భర స్థితిని దాటుకుని స్వరాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు చిరునామాగా నిలుస్తున్నాయి. మన ఊరు – మన బడి కార్యక్రమంతో సకల సౌలత్లను సమకూర్చుకుని కార్పొరేట్ స్కూళ్లను తలపిస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు కొత్త యూనిఫామ్తో న్యూ లుక్తో కనిపించనుండగా, ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు వర్క్ బుక్స్, ఆరు నుంచి పదో తరగతి వాళ్లకు నోటుపుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
సరిపడా టీచర్ల కేటాయింపు, నాణ్యమైన బోధనతోపాటు యూనిఫామ్, పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందిస్తుండడంతో గవర్నమెంట్ స్కూళ్లలో అడ్మిషన్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 3,113 ప్రభుత్వ పాఠశాలల్లో 2.27లక్షల మందికి పైగా మంది విద్యార్థులున్నారు. ఒక్కో విద్యార్థి నోట్బుక్స్, వర్క్బుక్స్ కొనుగోలుకు కనీసం 450 రూపాయలు ఖర్చు అవుతున్నది. తల్లిదండ్రులపై ఆ భారాన్ని తప్పిస్తూ జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమైన రోజునే పాఠ్యపుస్తకాలతోపాటు నోటుపుస్తకాలు, వర్క్ బుక్స్ అందించేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతున్నది. సర్కారు నిర్ణయంపై తల్లిదండ్రులు, ఎస్ఎంసీ చైర్మన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– రామగిరి, మే 5
స్వరాష్ట్రంలో విద్యకు ప్రాధాన్యమిస్తున్న సర్కారు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ దేశానికి రోల్మోడల్గా నిలుస్తున్నది. విద్యార్థుల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో ఇప్పటికే ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్తోపాటు సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నది. అలాగే మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పించి ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో సర్కారు బడికి వచ్చే పిల్లల తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా నోట్, వర్క్బుక్స్ అందించాలని తాజాగా నిర్ణయించారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 3,113 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2.27లక్షలకు పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది.
– రామగిరి/ మునుగోడు, మే 5
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్కారు ఇప్పటికే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫాం అందిస్తున్న విషయం విదితమే. మరోవైపు కడుపు నిండా సన్న బియ్యంతో రుచికరమైన భోజనం పెడుతున్నారు. అదేస్థాయిలో వచ్చే విద్యా సంవత్సరం ప్రాథమిక పాఠశాలల పిల్లలకు వర్క్బుక్స్, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నోట్బుక్స్ ఉచితంగా అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిని జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభ సమయంలో పాఠ్యపుస్తకాలతోపాటు విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అందించనున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తల్లిదండ్రులు, ఎస్ఎంసీ చైర్మన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 2,27,345 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. ఒక్కో విద్యార్థికి సబ్జెక్టుకు ఒకటి చొప్పున నోట్బుక్స్, వర్క్బుక్స్ అందజేయనున్నారు. వీటిని బయట కొనుగోలు చేయాలంటే ఒక్కొక్కరికి సుమారు రూ.450 వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులపై రూ.10 కోట్లకు పైగా భారం తగ్గనున్నది.
ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకం
సీఎం కేసీఆర్ సారథ్యంలో మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పించి ఆంగ్ల విద్య బోధిస్తున్నారు. ఇది ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు గొప్ప వరం. ఇప్పటికే విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందిస్తున్న ప్రభుత్వం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వర్క్బుక్స్, నోట్ బుక్స్ అందిస్తామని వెల్లడించడం చారిత్రాత్మక నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. విప్లవాత్మక నిర్ణయాలతో దేశంలోనే ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తున్న సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు.
– డీవీఎస్ ఫణికుమార్, పీఆర్టీయూ టీఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు
సర్కారు నిర్ణయం సంతోషకరం
మన ఊరు – మన బడి కార్యక్రమంతో కతాల్గూడ పాఠశాలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. సకల వసతులు కల్పించి ఆంగ్ల విద్య బోధిస్తున్నారు. దీంతోపాటు ఉపాధ్యాయుల కృషితో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వచ్చే విద్యా సంవత్సరం బడులు తెరువగానే పుస్తకాలు, యూనిఫాంతోపాటు వర్క్, నోట్బుక్స్ అందిస్తామని చెప్పడం సంతోషంగా ఉంది. నోట్ పుస్తకాల పంపిణీతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గనున్నది. ఎస్ఎంసీ వైస్ చైర్మన్గా తల్లిదండ్రులకు ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేసి చైతన్యం చేయడంతోపాటు విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు కృషి చేస్తా.
– పామనగుండ్ల కళావతి, ఎస్ఎంసీ వైస్ చైర్మన్, కతాల్గూడ, నల్లగొండ