గ్రామాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచే మల్టీపర్పస్ వర్కర్లకు గత మూడు నెలలుగా వేతనాలు రాక నానా అవస్థలు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీరికి కనీవినీ ఎరుగని రీతిలో వేతనాలు పెంచి హోదా కల్పించగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. రెక్కాడితేగాని డొక్కాడని వేతన జీవులు తమ బతుకు దెరువు ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నారు. జీతాలపై ఆధారపడి జిల్లా వ్యాప్తంగా 1800 మంది పనిచేస్తున్నారు. వారికి వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బడ్జెట్ కేటాయింపులు లేకనే వేతనాలు నిలిచిపోయినట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం స్పందించి వేతనాలు విడుదల చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
సూర్యాపేట, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల పరిస్థితి అధ్వానంగా ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సాగు, తాగునీటితో పాటు పచ్చదనం పెంచి రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేశారు. అలాగే చెత్త సేకరణ సెగ్రిగేషన్ షెడ్ల ద్వారా తడి చెత్తతో ఎరువుల తయారు చేసి గ్రామాలకు ఆదాయ మార్గాలు పెంచారు. ఇవన్నీ చేయడంతో పాటు పంచాయితీకో ట్రాక్టర్, ట్యాంకర్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెల నెలా కోట్లాది రూపాయలు ఇచ్చి గ్రామాలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. వీటితో పాటు గత ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల్లో ఏ పని చేయాలన్నా రెండు, మూడు నెలల కోసం లేదా ఏడాది పాటు ఆయా పంచాయతీలను బట్టి శానిటేషన్ వర్కర్లు, ఎలక్ట్రిషియన్, పంపు ఆపరేటర్లను రూ.వెయ్యి నుంచి 3వేల వరకు వేతనాలు ఇచ్చి నియమించుకునేవారు. నాడు జిల్లా మొత్తం కలిపి 400లకు మించి లేకపోగా తెలంగాణ ఆవిర్భావానంతరం తాత్కాలిక పద్ధతిన కార్మికులను తీసుకోవడం నిలిపివేసింది. ఆయా పంచాయతీల్లో పర్మినెంట్గా ఉండేలా మల్టీ పర్పస్ వర్కర్ల పేరిట పర్మినెంట్ రిక్రూట్మెంట్ చేశారు. పంచాయతీల జనాభా ప్రకారం నాలుగు నుంచి ఎనిమిది మంది వరకు నియమించగా జిల్లాలో 1800ల మందిని నియమించారు. నాటి కేసీఆర్ ప్రభుత్వం వారికి తొలుత నెలనెలా రూ.8500లు ఇవ్వగా తదనంతరం రూ.9500లకు పెంచి నెలనెలా వేతనాలను ఇచ్చేది.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇబ్బందులు
రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 420 హామీలతో పాటు పంచాయతీల్లో పనిచేసే మల్టీ పర్పస్ వర్కర్లకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా నేటికీ ఎలాంటి అతీగతీ లేదు. కేసీఆర్ హయాంలో స్టేట్ ఫైనాన్స్ నిధుల వల్ల నెలనెలా వేతనాలకు ఇబ్బంది లేకపోగా గత రెండేళ్లుగా రేవంత్ సర్కార్ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధితో పాటు మెయింటనెన్స్ కూడా చేయలేని దుస్థితికి చేరుకున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతీ నెలా క్రమం తప్పకుండా 10వ తేదీలోపే వేతనాలు అందేవి. కానీ గత మూడు మాసాల నుంచి వీరి వేతనాలకు బ్రేక్ పడింది. దీంతో ఇంటి అద్దెలతో పాటు ఇతర కుటుంబ అవసరాలకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. రాష్ట్ర శాఖలో బడ్జెట్ లేకపోవడం వల్లనే వేతనాలు పెండింగ్లో ఉంటున్నాయని పేర్కొంటున్నారు. అప్పు చేసి అవసరాలు తీర్పుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బకాయి వేతనాలను విడుదల చేయాలని కోరుతున్నారు.
వేతనాలు విడుదల చేయాలి
మేం చిరుద్యోగులం. నెల వేతనం వస్తేనే పూట గడుస్తది. మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నాం. దొరికిన కాడల్లా అప్పు చేసి పూట గడుపుతున్నాం. ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి.
-తన్నీరు వెంకన్న, మల్టీపర్పస్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు