క్రీస్తును దర్శించడానికి వందలాదిగా భక్తులు వచ్చేవారు. కొందరు తమ వెంట పిల్లలనూ తీసుకువచ్చేవారు. కారణం.. ప్రభువు పిల్లలను చూసి తమను దగ్గరికి ఆహ్వానిస్తాడని, దీవిస్తాడని, కొన్ని మంచి మాటలు చెబుతాడని! అయితే ప్రభువు శిష్యులు.. పిల్లలను వెంట తెచ్చే తల్లిదండ్రులపై ఆగ్రహం ప్రకటించేవారు. ‘క్రీస్తు బోధనలు పిల్లలకు అర్థం కావు’ అంటూ కోపగించేవారు. దీంతో ఆ తల్లిదండ్రులు బాధతో వెనుదిరిగేవారు. శిష్యుల ప్రవర్తన ఒకసారి ప్రభువు కంటపడింది.
వారిని కోపగించుకున్నారు. ‘పిల్లలను నా దగ్గరకు రాకుండా ఆటంకపరచవద్దు. వారిని ఆశీర్వదిస్తాను. పెద్దలను పరామర్శించినట్లే.. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్త వహిస్తాను. ఆ చిన్నారులను ఆహ్వానించండి. ప్రేమ, నమ్మకం నిండుగా ఉన్నవాళ్లే.. దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. పిల్లల మాదిరిగా వినయశీలురై ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. నేర్చుకోవడానికి పిల్లల్లా కుతూహలం చూపాలి’ అన్నారు ప్రభువు.