నడిగూడెం, ఫిబ్రవరి 9 : ప్రతీ విద్యార్థి ఒక చరిత్రకారుడు కావాలని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో గురువారం ఆయన మన ఊరు- మన చరిత్రపై మండలంలోని సిరిపురం గ్రామంలో స్వయంగా చరిత్ర నిర్మాణానికి అవసరమైన అంశాలు సేకరించడంతో పాటు, ఎలా సేకరించాలి అనే దానిపై కోదాడ కేఆర్ఆర్ కళాశాల డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. రైతులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, స్వాతంత్య్ర సమరయోధులను కలిసి గ్రామ చరిత్రను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మన గ్రామాల్లో ఎన్నో చరిత్రాత్మక ఆనవాళ్లు, వాటి నేపథ్యం, ఆచార వ్యవహరాలు ఉన్నాయని వాటిని వెలికితీయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మన ఊరు- మన చరిత్రను ప్రారంభించిందన్నారు.
బ్రిటీష్ చరిత్రను చదవడం కాదు మన చరిత్రను ప్రపంచ దేశాలు చదివేలా తయారు చేయనున్నట్లు తెలిపారు. డిగ్రీ విద్యార్థులు తయారు చేసిన నివేదికను వీకిపీడియా, ఆన్లైన్లో నమోదు, పుస్తకాల ముద్రణ చేయనున్నట్లు తెలిపారు. గ్రామంలోని వ్యవసాయం, ప్రాచీన ఆలయాలు, వృత్తులు, ఆటలు, రవాణా సౌకర్యం, అడవులు, చారిత్రక ఆనవాళ్లు, స్థలాలు, ఆవిర్భావం, వనరులు, పూజలు, అభివృద్ధి, ఆరోగ్యం, స్వాతంత్య్ర సమరయోధులు, జీవన ప్రమాణాలు అంశాలపై పరిశోధన చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థులు గ్రామాల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, సాహితీవేత్తల అభిప్రాయాల ద్వారా సమాచారం సేకరించి పొందుపరుస్తారన్నారు. ఆనాడు ఆచారం, అభివృద్ధి ఎలా ఉంది.. నేడు ఎలా ఉంది వంటి వాటిని ప్రత్యేక వివరాలు సేకరిస్తారని తెలిపారు.
12,769 గ్రామాల్లో సర్వే
తెలంగాణ రాక ముందు, వచ్చాక గ్రామాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, అభివృద్ధి ఫలాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా, జీవన విధానం, మానవ సంబంధాలపై రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33జిల్లాల్లో జిల్లాకు ఒకరు చొప్పున 33మంది జిల్లా కోఆర్డినేటర్లను నియమించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 12,769గ్రామాల్లో మన ఊరు- మన చరిత్ర సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా డిగ్రీ చదువుతున్న విద్యార్థులు సర్వేను చేపట్టి మౌలిక వసతులు, అన్ని శాఖల అభివృద్ధి ఫలాలు, విద్య, వైద్యం, సాగునీరు, వ్యవసాయం, తదితర అంశాలను సేకరించనున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 700గ్రామాల్లో సర్వే పూర్తి కాగా, నల్లగొండ జిల్లాలో 250గ్రామాల్లో సర్వే పూర్తైనట్లు తెలిపారు. విద్యాశాఖ మాజీ డైరెక్టర్ నవీన్ మిట్టల్ సహకారంతో విద్యాశాఖ, సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సర్వే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు సహకరించడం అభినందనీయమన్నారు. కేఆర్ఆర్ కళాశాల విద్యార్థులు 26గ్రామాల్లో మన ఊరు- మన చరిత్రపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు.
మన ఊరు- మన చరిత్ర కోసం వచ్చే విద్యార్థులకు సహకరించాలని కోరారు. రాబోయే తరాలకు మన గ్రామ చరిత్రలు తెలవాలనే సర్వే చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో కేఆర్ఆర్ కళాశాల తెలుగు అధ్యాపకురాలు, జిల్లా కోఆర్డినేటర్ నందిగామ నిర్మలాకుమారి, తెలుగు అధ్యాపకుడు వేముల వెంకటేశ్వర్లు, ఎంఈఓ సలీం షరీఫ్, సర్పంచ్ వీణాభిక్షపతి, ఎంపీటీసీ జ్యోతీసతీశ్, మాజీ ఎంపీపీ కాసాని వెంకటేశ్వర్లు, చలపతి, లక్ష్మయ్య, విద్యార్థులు షేక్ ఇర్ఫాన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. మండలంలోని కాగిత రామచంద్రాపురం గ్రామానికి చెందిన అబ్దుల్ గని, షరీఫ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా బాధిత కుటుంబసభ్యులను సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరిశంకర్ పరామర్శించారు.