హాలియా, అక్టోబర్ 3 : బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వానికే పట్టం కట్టాలని సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం అనుముల మండలంలోని కొరివేనుగూడెం, మధారిగూడెం, రామడుగు, చింతగూడెం, యాచారం, మారేపల్లి, తిమ్మాపురం, పులిమామిడి, శ్రీనాథపురం గ్రామాల్లో రూ. 8.30 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
మండలంలోని రాముడుగ గ్రామంలో యువకులకు క్రికెట్కిట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లేదని, నెలకు రూ. 600 మించి పింఛన్ ఇవ్వడం లేదన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ సీఎంగా ఉండడంతో తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే నియోజకవర్గంలో అభివృద్ధి మొదలైందన్నారు. గడిచిన రెండేండ్ల కాలంలో అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 30 నుంచి రూ. 70 లక్షలు మంజూరు చేసిందన్నారు. కొన్ని గ్రామాల్లో కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఏడు సార్లు ఎమ్మెల్యేగా, 16 ఏండ్లు మంత్రిగా పని చేసిన జానారెడ్డి గ్రామాల్లో కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో 20 ఏడ్లు నత్తనడకన సాగిని వరదకాల్వను పూర్తి చేయడంతో పాటు ఎడమ కాల్వ ఎగువ భాగంలో ఉన్న టేలాండ్ భూములకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసి గెలిపించడం ద్వారా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సహకరించాలని కోరారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మండలంలోని కొరివేనుగూడెం, మదారిగూడెం గ్రామాల్లో రూ. 20 లక్షలతో చేపట్టిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు, రూ. 2.80 లక్షలతో మదారిగూడెం వరకు బీటీరోడ్డు పనులకు, చింతగూడెంలో రూ. 50 లక్షలు, రామగుడులో రూ. కోటి, యాచారంలో రూ. 90 లక్షలు, మారేపల్లిలో రూ. 90 లక్షలు, పులిమామిడి గ్రామంలో రూ. 40 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రామడుగు తిమ్మాపురం గ్రామాల మధ్య రూ.2.30 లక్షలతో, శ్రీనాథపురం ఆర్అండ్బీ రోడ్డు నుంచి బంటువారిగూడెం వరకు రూ.1.10 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
కొరివేనుగూడెంలో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, రామడుగులో రూ.32 లక్షలతో నిర్మించిన ఓవర్హెడ్ ట్యాంక్, మారేపల్లిలో రూ.20 లక్షలతో చేపట్టిన సీసీరోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ ఎడవల్లి విజయేందర్రెడ్డి, హాలియా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాజి వెంకటేశం, వైస్ ఎంపీపీ మాలే అరుణాసత్యనారాయణరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, మండల ప్రధాన కార్యదర్శి ఎన్నమల్ల సత్యం, ఎంపీటీసీలు ఉర్లగొండ వెంకటయ్య,
కొండ రమేశ్, పేరూరు దేవస్థాన కమిటీ చైర్మన్ రాయనబోయిన రామలింగయ్య, మార్కెట్ డైరెక్టర్లు పోశం శ్రీనివాస్గౌడ్, సురభి రాంబాబు, యువజన నాయకుడు పంగ లక్ష్మణ్యాదవ్, ఆయా గ్రామాల సర్పంచులు, మేరెడ్డి వెంకట్రెడ్డి, కుందారపు సైదులు, బొమ్మిశెట్టి పద్మావెంకట్వేర్లు, వెంకట్రాంరెడ్డి, పాశం రవీందర్రెడ్డి, చెరుపల్లి రాములు, గుండెబోయిన వెంకన్న, మాలే వెంకట్రెడ్డి, బొప్పని విజయ్కుమార్, దశరథ, కౌన్సిలర్లు నల్లబోతు వెంకటయ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బతుకమ్మ చీరెల పంపిణీ
హాలియా :బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు అందిస్తున్న చీరెలను మండలంలోని కొరివేనుగూడెం, రామడుగు, పులిమామిడి, శ్రీనాథపురం గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ పంపిణీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిని సీమాంధ్ర పాలకులు ధ్వంసం చేయారన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మన సంస్కృతి సంప్రదాయాలకు జీవం పోశారన్నారు. రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.