యాదాద్రి భువనగిరి, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : ఎగవేతలకు కేరాఫ్గా రైతు భరోసా పథకం నిలుస్తున్నది. కోతలకు చిరునామాగా పెట్టుబడి సాయం స్కీం ముందంజలో ఉన్నది. ఒకప్పుడు దేశానికే తలమానికంగా మారిన పథకం.. ఇప్పుడు అభాసుపాలవుతున్నది. అసలు పథకం అమలు తీరే ఆగమ్యగోచరంగా ఉంది. యాసంగిలో ఎందరికో కోత పెట్టి.. కొందరికి రెండెకరాలకు వరకే పెట్టుబడి సాయం అందజేసి ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది. ఇప్పుడు మిగతా పెండింగ్ డబ్బులపై ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నది. దీంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2023 అధికారంలోకి వచ్చిన కొత్తలో యాసంగిలో పెట్టుబడి సాయం అందించింది. ఆ తర్వాత వానకాలం సీజన్ మొత్తానికే రైతులకు ఎగనామం పెట్టింది. యాసంగిలో కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లు ఎకరాకు రూ. 5వేల సాయం కూడా ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేసింది. ఆ సీజన్లో 2.40 లక్షల మంది రైతులకు సుమారు రూ. 290 కోట్లు ఇవ్వకుండా చెయ్యిచ్చింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయారు. చేసేదేం లేక.. బ్యాంకుల్లో అప్పటికే రుణాలు తీసుకోవడంతో బయట ప్రైవేట్లో వడ్డీకి అప్పులు తెచ్చుకున్నారు.
యాసంగి సీజన్-2024లో రైతు భరోసా అందించడానికి ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టింది. కొత్తగా నిబంధనలు రూపొందించాలని, అనర్హులను ఏరివేయాలంటూ జాప్యం చేసింది. మంత్రి వర్గ ఉప సంఘం కమిటీ పేరుతో కాలయాపన చేసింది. సాగు చేయడంలేదంటూ కొందరికి కోత పెట్టింది. యాసంగిలో మొత్తం 2.40 లక్షల మందికి సుమారు 280 కోట్ల వరకు రైతు భరోసా అమలు చేయాలని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. సీజన్ ప్రారంభంలోనే పెట్టుబడి సా యం అందాల్సి ఉండగా.. కొందరికి మాత్రం మధ్యలో జమ చేశారు. మొత్తానికి యాసంగి సీజన్లో 1,88,526 మంది రైతులకు రూ. 174 కోట్లు మాత్రమే జమ చేసింది. అది కూడా మూడెకరాల లోపు వారికి మాత్రమే. అంటే సుమారు 52 వేల మందికి ఇంకా రూ. 106 కోట్ల వరకు పెండింగ్లో పెట్టింది.
ఈ ఏడాది యాసంగి సీజన్లో రైతు భరోసా పథకం అరకొరగానే అమలు చేసింది. సీజన్ ప్రారంభంలో కాకుండా మధ్యలో, చివరలో విడతలవారీగా డబ్బు జమ చేసింది. మొత్తం గా రెండు ఎకరాలకు మాత్రమే పెట్టుబడి సాయం అందించింది. అది కూడా ఎన్నికలు ఉన్నప్పుడే జమ చేయడం గమనార్హం. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,41,285 మంది రైతులకు రూ. 192 కోట్లు ఖాతాల్లో వేసింది. గత వానకాలంలో రూ.306 కోట్లు వేయగా, యాసంగిలో మాత్రం రూ.192 కోట్లు మాత్రమే అందించింది. అంటే సుమా రు వంద కోట్లకు ఎగనామం పెట్టింది. దీంతో రైతులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఠంచనుగా డబ్బులు జమ అయ్యేవని, కాంగ్రెస్ వచ్చాక కష్టాలు తప్పడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వానకాలం సీజన్లోనైనా సక్రమంగా అందుతాయో..? లేదో వేచి చూడాల్సిందే.
కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం 2018లో రైతు బంధు పథకం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఏటా రెండు సార్లు ఎకరాకు రూ. 5వేల చొప్పున పెట్టుబడి సాయంగా డబ్బును బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. పంటల సాగు సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే పెట్టుబడి సాయం చేసేది. ప్రతి సీజన్ ప్రారంభలోనే అడగక ముందే డబ్బులు రైతుల ఖాతాల్లో వేసి ఆదుకుంది. ఎంత భూమి ఉన్నా అర్హులైన అందరికీ వర్తింపజేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఏటా ఎకరాకు రూ. 15వేల సాయం చేస్తామని హామీ ఇచ్చింది. అంతే కాకుండా కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని వాగ్ధానం చేసింది. అది కూడా 2023 డిసెంబర్ 9వ తేదీనే ఇస్తామని ప్రకటించింది. ఆ సీజన్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే రూ. 5వేలు జమ చేసినట్లే ఇచ్చి చేతులు దులుపుకొంది.