మిర్యాలగూడ, జనవరి 19 : అమలుకు నోచని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిపై దృష్టి పెట్టాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 420 హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తే తమ పార్టీ తరఫున సహకారం అందిస్తామన్నారు.
రైతులకు మేలు చేస్తున్న సొసైటీలపై రాజకీయాలు చేయడం తగదని పేర్కొన్నారు. తడకమళ్ల పీఏసీఎస్ గతంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ప్రస్తుత పాలకవర్గం ఆధ్వర్యంలో లాభాల వైపు పయనిస్తుందని తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా రైతులకు ఇబ్బందులు లేకుండా సక్రమంగా ఎరువులు అందించారన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రైతుబంధు నేటికీ అందించలేకపోయిందని, రూ.2లక్షల రుణమాఫీ ఊసే లేకుండా పోయిందని, ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు భృతి ఊసే లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మెజారిటీ ఉన్న మున్సిపాలిటీలు, పీఏసీఎస్లలో కౌన్సిలర్లు, డైరెక్టర్లను ప్రలోభాలకు గురి చేసి అవిశ్వాసం పెట్టి పంతం నెగ్గించుకుంటున్నారని అన్నారు.
తడకమళ్ల పీఏసీఎస్లో అవిశ్వాసం పెట్టి అబాసుపాలైందని ఎద్దేవా చేశారు. అవిశ్వాసాలను ప్రజలు, రైతులు హర్షించరని హితవు పలికారు. రైతులు, ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఏ ప్రభుత్వమైనా పతనం కాక తప్పదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మట్టపల్లి సైదులుయాదవ్, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, నాయకులు మోహన్గౌడ్, శేఖర్రావు, రవి, నాగయ్య, భిక్షం, వెంకటయ్య, సోమయ్య పాల్గొన్నారు.