సూర్యాపేట, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం తీసుకొచ్చి అన్నదాతలకు అండగా నిలిచింది. వానకాలం, యాసంగికి రూ.5 వేల చొప్పున ఏటా ఎకరానికి రూ.10 వేలు అందించి పంట పెట్టుబడికి ఇబ్బంది లేకుండా చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. పంట పెట్టుబడి సాయాన్ని మరింత పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ ఇంతవరకు పెంచి ఇవ్వక పోగా ఇప్పటివరకు ఐదెకరాల్లోపు రైతులకు కూడా పూర్తిస్థాయిలో రైతుబంధు అందివ్వలేదు. దాంతో రైతులు అరిగోస పడుతున్నారు.
మరోవైపు ఇచ్చిన హామీని నెరవేర్చలేని సర్కారు రైతుబంధును నిలిపివేసే కుట్ర చేస్తున్నది. వచ్చే సీజన్ నుంచి సాగు చేసే భూములకే రైతుబంధు ఇస్తామని ప్రభుత్వం చెబుతుండడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సాగు భూమిని లెక్కేసేందుకు శాటిలైట్ వెరిఫికేషన్ అంటుండగా అసలు రైతు భూమికి కో ఆర్డినేట్స్ లేకుండా శాటిలైట్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందనేది తెలిసే పరిస్థితి లేదు. ఒకవేళ ఏఈఓలతో వెరిఫై అన్నా మళ్లీ అనేక సమస్యలు తలెత్తి గందరగోళం నెలకొనే అవకాశం ఉంటుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం ప్రకటిత కరువు తెచ్చి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి సాగు చేసే భూమికే రైతు భరోసా ఇస్తామంటున్నదని, దశలవారీగా రైతు భరోసాను తొలగించేందుకు కుట్ర పన్నుతుందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. సొంత భూమి ఉన్న రైతులకే రైతు బంధు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రానున్న రోజుల్లో కౌలు రైతుకు ఎట్లా ఇస్తుందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ను నమ్మితే రైతులు నట్టేట మునిగినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు.
కాంగ్రెస్ సర్కారు పంట వేసిన రైతుకే రైతు బంధు అంటున్నది. శాటిలైట్ వెరిఫికేషన్ అని మరో నాటకం ఆడుతున్నది. సమస్యలు సృష్టించేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేప్పటిన తొలిసారే రైతులకు రైతుబంధు ఇవ్వలేదు. ఇంకా శాటిలైట్ సర్వే చేసి ఇస్తామనడం రైతులను మోసం చేసేందుకే. కాలం కాక పోతే రైతులు సాగు చేసేది ఎట్లా.
– నామిరెడ్డి సుధాకర్రెడ్డి, ఇరుగంటిపల్లి, కనగల్ మండలం
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వం రైతులకు వెంటవెంటనే రైతుబంధు అందించి రైతుల కష్టాలను తీర్చింది. రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతుబంధు ఇవ్వలేక కొర్రీలు పెడుతూ శాటిలైట్ ద్వారా పంట సర్వే చేయించి రైతుబంధు వేస్తామని చెప్పడం హాస్యాస్పదం. శాటిలైట్ సర్వేల వల్ల రైతులకు, కౌలు రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరదు. ఇప్పటివరకు అన్నమాటలను నిలబెట్టుకోని సీఎం రేవంత్రెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో రైతులకు మేలు చేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. గత ప్రభుత్వం మాదిరిగానే రైతులను ప్రతి కారుకు రైతుబంధు వేసి రైతులను ఆదుకోవాలి.
– నామిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతు సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు
రైతులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతులకు మేలు చేసే ఒక్క కార్యక్రమమైనా చేయడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఇంకో విధానంతో రైతులను మోసం చేయడానికి చూస్తున్నాడు. కాంగ్రెస్కు సరైన టైంలో బుద్ధి చెప్పడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు.