రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లె ప్రగతితో గ్రామ పాలన కొత్త పుంతలు తొక్కింది. జిల్లాలోని 421 గ్రామ పంచాయతీల్లో పక్కాగా చేపడుతున్న అభివృద్ధి పనులు, నాలుగు విడుతల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల సత్ఫలితాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. అధికారుల చొరవ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో పెరిగిన అవగాహనతో పల్లెల రూపురేఖలు మారిపోయాయి. అన్నదాతలకు వేదికైన రైతు వేదికలు.. పల్లె ప్రజలకు ఆహ్లాదం పంచుతున్న పల్లె ప్రకృతి వనాలు.. చివరి మజిలీ కష్టాలను గట్టెక్కించిన వైకుంఠధామాలు.. వీధుల్లో చెత్త అనేదే లేకుండా ఊడ్చేస్తున్న గ్రామ పంచాయతీ ట్రాక్టర్.. ఇలా ప్రతి ఒక్కటీ స్పష్టమైన మార్పును తీసుకొచ్చాయి. రెండున్నర ఏండ్ల కాలంలో గ్రామపంచాయతీలకు అందిన రూ.413 కోట్లతో పచ్చదనం, పరిశుభ్రతతోపాటు అభివృద్ధి ఒనగూరి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతున్నది.
యాదాద్రి భువనగిరి, మే 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లె పాలనలో గుణాత్మక మార్పును తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి ‘పల్లె ప్రగతి’లో పెద్ద పీట వేసింది. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిచ్చి నిధులను అందించి పల్లెల సర్వతోముఖాభివృద్ధికి చర్యలు చేపట్టింది. జిల్లాలోని 421 పంచాయతీల్లో ఏర్పాటైన వన నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వర్మీకంపోస్టు యార్డులు గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ఎంతో దోహదపడుతున్నాయి. రైతు వేదికలు, వైకుంఠధామాలు గత సమస్యలకు చరమగీతం పాడుతున్నాయి. పల్లెలకు మణిహారంలాంటి ఎన్నో అభివృద్ధి పనులు అందుబాటులోకి వచ్చి పల్లెల రూపు రేఖలు సమూలంగా మారిపోయాయి.
ప్రజల ముంగిటకు ప్రగతి ఫలాలు
సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా ప్రజల ముంగిటకు ప్రగతి ఫలాలు వచ్చాయి. గ్రామాభివృద్ధిలో ట్రాక్టర్ కీలకంగా మారింది. చెత్తతోపాటు ఇతర వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలించడంలోనూ, హరితహారం మొక్కలకు నీళ్లు అందించడంలోనూ ట్రాక్టర్ ఎంతగానో ఉపయోగపడుతున్నది. మొక్కల సంరక్షణకు ఒక్కో ట్రిప్పునకు ట్యాంకర్కు రూ.600 చొప్పున పంచాయతీ ఖాతాల్లో జమ అవుతున్నాయి. ప్రస్తుతం ఏ పల్లెను చూసినా పచ్చదనంతోపాటు, పరిశుభ్రమైన వీధులు కన్పిస్తున్నాయి. గుంతలను పూడ్చడం, పిచ్చిచెట్లను తొలగించడం, కూలిపోయే దశలో ఉన్న పాత ఇండ్లను కూల్చివేయడం, పాడుబడ్డ బావులు, బొందలను పూడ్చడం, వేలాడే విద్యుత్ తీగలను సరిచేయడం, రోడ్ల మధ్యలో ఉన్న కరెంటు స్తంభాలను మార్చడం, శిథిలమై, వంగిపోయిన స్తంభాలను మార్చడం వంటి పనులను నిరంతరాయంగా చేపడుతుండడంతో ఆయా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. నాలుగు విడుతల్లో చేపట్టిన పల్లె ప్రగతి పనులతో ‘పల్లె ప్రగతికి ముందు.. ఆ తర్వాత’ అన్నట్టుగా గ్రామాల్లో పరిస్థితులు మారిపోయాయి.
పరిశుభ్రతకు కేరాఫ్గా పల్లెలు
వర్మీకంపోస్టు , డంపింగ్ యార్డులు : 419
వినియోగంలోకి వచ్చినవి 419
పల్లెల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా ప్రభుత్వం పంచాయతీకి ఒక్కటి చొప్పున జిల్లాలోని 421 పంచాయతీల్లో డంపింగ్ యార్డులతోపాటు, వాటి పక్కనే వర్మీకంపోస్టు యార్డులను నిర్మించింది. ఒక్కో నిర్మాణానికి రూ.2.50లక్షల చొప్పున ఖర్చుపెట్టింది. ప్రస్తుతం 419 వర్మీకంపోస్టు యార్డులు వినియోగంలోకి వచ్చాయి. గడపగడపకూ సేకరించిన చెత్తను సేకరించి ఎప్పటికప్పుడు ట్రాక్టర్లలో డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ఆ చెత్తను కంపోస్టుగా మార్చి హరితహారం మొక్కలకు, పొలాల్లో ఎరువులుగా రైతులకు అందిస్తున్నారు. నిరంతర పర్యవేక్షణతో చెత్త తరలింపు ప్రక్రియ నిర్విఘ్నంగా సాగుతుండడంతో పల్లె రోడ్లన్నీ అద్దంలా మెరుస్తున్నాయి.
సమాచార కేంద్రాలుగా రైతు వేదికలు
పూర్తయినవి 92
వినియోగంలోకి వచ్చినవి 92
ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటు పంటల సాగు సమస్యలపై రైతులంగా ఒకేచోట చేరి చర్చించేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలు సకల హంగులతో సిద్ధమయ్యాయి. రూ.22లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న 92 నిర్మాణాలకు ఇప్పటివరకు రూ.20.24 కోట్లు ఖర్చుచేయగా పనులు పూర్తి చేసుకున్న రైతు వేదికల్లో కార్యకలాపాలు సైతం మొదలయ్యాయి. జిల్లా ఖనిజ అభివృద్ధి నిధుల నుంచి రూ.44లక్షల నిధులను రైతు వేదికల కోసం వెచ్చించారు. రైతు వేదికల్లో వ్యవసాయ అధికారులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండడంతో రైతులకు ఎప్పటికప్పుడు మెలకువలు అంది సాగు సమస్యలు తీరుతున్నాయి. ఒకప్పటి సాగు ఇబ్బందులు తీరడంతో రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నది.
పల్లె వికాసానికి రూ.413కోట్లు…
రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడుతల్లో చేపట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం పల్లెల స్వరూపాన్ని సమూలంగా మార్చివేసింది. మొదటి విడుత 2019 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు, రెండో విడుత 2020 జనవరి 2 నుంచి 12 వరకు, మూడో విడుత 2021 జూన్ 1 నుంచి 10 వరకు, నాలుగో విడుత 2021 జూలై 1 నుంచి 10 వరకు ప్రభుత్వం చేపట్టింది. 2019 సెప్టెంబర్ నుంచి 2021 జనవరి వరకు నెలనెలా రూ.7కోట్ల చొప్పున ఇప్పటివరకు పంచాయతీలకు రూ.231కోట్లను సమకూర్చింది. అలాగే మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి, బృహత్ ప్రకృతి వనాలు, నర్సరీలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు తదితర నిర్మాణాల కోసం రెండున్నరేండ్లలో రూ.182.63కోట్లను ప్రభుత్వం ఖర్చుచేసింది. మొత్తంగా జిల్లాలోని పల్లెల వికాసం కోసం రూ.413కోట్లను ప్రభుత్వం ఖర్చుచేయడంతో పల్లెల్లో ఒకప్పటి సమస్యలు కనుమరుగయ్యాయి.
తీరుతున్న అంత్యక్రియల సమస్యలు…
పూర్తయినవి 418
వినియోగంలోకి వచ్చినవి 418
అంతిమ సంస్కారాల సందర్భంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చేందుకు ప్రభుత్వం గ్రామపంచాయతీకి ఒక్కటి చొప్పున ఒక్కో నిర్మాణానికి రూ.12.50లక్షలు వెచ్చించి జిల్లాలోని 421 పంచాయతీల్లో వైకుంఠధామాలను నిర్మిస్తున్నది. గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో పనులు చేపడుతుండగా.. ఇప్పటివరకు 418 వినియోగంలోకి వచ్చాయి. దహన సంస్కారాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతోపాటు స్నానాల కోసం గదులను సైతం నిర్మించారు. గతంలో వైకుంఠధామాలు లేక అంత్యక్రియలను పొలం గట్ల వెంట, ఊరి శివార్లలో ఎక్కడ పడితే అక్కడే చేసేవారు. ప్రస్తుతం చాలాచోట్ల వైకుంఠధామం నిర్మాణాలు అందుబాటులోకి రావడంతో పల్లెల్లో దహన సంస్కారాల సమస్య తీరింది.
పల్లెవించిన చైతన్యం…
స్వరాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామ పంచాయతీలు గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు పర్యవేక్షణ కోసం ప్రతి పంచాయతీకో కార్యదర్శిని ప్రభుత్వం నియమించింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నెలనెలా ప్రభుత్వం ఇస్తున్న నిధులను అందిపుచ్చుకుని పనులు చేయడంతో ప్రజా సమస్యలు సైతం చాలావరకు తీరాయి. దీంతో ప్రజలు సైతం చైతన్యవంతులై పన్ను చెల్లింపులకు ముందుకు రావడంతో పంచాయతీలు ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోగలిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.962.57లక్షల(98.13 శాతం)పన్ను వసూలైంది.
జీవ వైవిధ్యానికి నెలవులుగా ప్రకృతి వనాలు
పూర్తయినవి 650
వినియోగంలోకి వచ్చినవి 650
గ్రామీణ ప్రాంతాల్లోనూ పార్కులను అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లాలోని 421 పంచాయతీలతోపాటు 229 ఆవాస గ్రామాలు కలుపుకొని 650 చోట్ల ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. ఒక్కో ప్రకృతి వనానికి రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు వెచ్చించింది. రకరకాల మొక్కలను నాటడంతోపాటు వాకింగ్ ట్రాక్ను ప్రతి వనంలో అందుబాటులోకి తెచ్చారు. అన్ని ఆవాసాల్లోనూ ప్రకృతి వనాలు పూర్తిస్థాయిలో ఏర్పాటుకావడంతోపాటు వినియోగంలోకి సైతం వచ్చాయి. జీవవైవిధ్యానికి నెలవుగా ఉన్న ప్రకృతి వనాలు పల్లె ప్రజానీకాన్ని ఆహ్లాదంలో ముంచెత్తుతున్నాయి. మండలానికి ఒకటి చొప్పున బృహత్ ప్రకృతి వనాన్ని రూ.38లక్షల వ్యయంతో చేపడుతుండగా.. ఇప్పటివరకు 10చోట్ల మాత్రమే బృహత్ ప్రకృతివనాలు పూర్తికావొచ్చాయి.
నర్సరీల్లో 49 లక్షల మొక్కల పెంపకం
నర్సరీలు 418
మొక్కల లక్ష్యం 49లక్షలు
ఏ గ్రామంలో నాటాల్సిన మొక్కలు అదే గ్రామంలో అందుబాటులో ఉండేలా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపాలిటీ, అటవీశాఖల ఆధ్వర్యంలో విస్తారంగా మొక్కల పెంపకాన్ని చేపడుతున్నది. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 418 నర్సరీలను ఏర్పాటు చేసి ఏటా 49లక్షల మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. ఒక్కో నర్సరీకి రూ.1.30లక్షల నుంచి రూ.1.50లక్షల వరకు ప్రభుత్వం ఖర్చుచేసింది. ఖాళీ ప్రదేశాలు, రహదారులకు ఇరువైపులా.. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ప్రాంగణాల్లో విరివిగా మొక్కలను నాటుతున్నారు. నర్సరీల్లో పెంచిన మొక్కలను హరితహారంలో వినియోగిస్తుండడంతో హరిత పల్లెలుగా మారాయి.
నంబర్ వన్ స్థానంలో వడపర్తి గ్రామం…
సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్ఏజీవై) పథకం అమలులో ఇటీవల కేంద్రం టాప్ 20 గ్రామాలను ప్రకటించగా.. దేశంలోనే మొదటి స్థానంలో భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామం నిలిచింది. ఒకప్పుడు సాదాసీదాగా ఉన్న ఈ పల్లె నేడు సంపూర్ణ అభివృద్ధితో రూపురేఖలు మార్చుకుని ఆదర్శంగా నిలిచింది. పార్లమెంట్ సభ్యులు సంవత్సరానికి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుండగా..తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతిలో చేపట్టిన కార్యక్రమాలు టాప్లో నిలవడానికి దోహదపడ్డాయి.
రూ.182.63కోట్లతో అభివృద్ధి పనులు..