సూర్యాపేట అర్బన్, జనవరి 31 : ఆర్టీసీ కార్మికులపై వేధింపులకు పాల్పడుతున్న సూర్యాపేట ఆర్డీసీ డిపో ట్రాఫిక్ సీఐ నాగశ్రీపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సూర్యాపేట డిపో గేటు ఎదుట బుధవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తన ఇష్టానుసారంగా డ్యూటీ చార్ట్లు వేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 2019 లో సమ్మె సందర్భంగా నమోదైన కేసుల నిమిత్తం 14 మంది డిపో కార్మికులు కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఇవేమీ పట్టించుకోకుండా డ్యూటీకి రావాల్సిందే అంటూ వేధిస్తున్నారని తెలిపారు.
సూర్యాపేట డిపోలో చాలా కాలంగా సూపర్వైజర్లు, ఏడీసీలు పాతుకుపోయి కార్మికులపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సూపర్వైజర్లు అక్రమ వసూళ్లకు తెర లేపారని, దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. ఈ విషయాలపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు పనాస మధు, సుధాకర్, అంజయ్య, లచ్చయ్య, ఎన్సీ సైదులు, లక్ష్మయ్య, మధుసూదన్రావు, వెంకన్న, రమేశ్, సైదులు, వెంకటేశ్వర్లు, లింగయ్య, స్వామి, శ్రీకంఠం, సుజాత పాల్గొన్నారు.