మోత్కూరు, డిసెంబర్ 2 : తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి యోధుడు కాసోజు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి నేడు(శనివారం) మండలంలోని పొడిచేడులో జరుగనున్నది. రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మహోద్యమంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష శ్రీకాంతాచారిలో ఉద్యమావేశాన్ని నింపింది. ఉద్యమకారులపై అప్పటి సమైఖ్య ప్రభుత్వం విధించిన దమనకాండ, అరెస్టులను తట్టుకోలేని శ్రీకాంతాచారి తన చావుతోనైనా సీమాంధ్ర పాలకులకు కనువిప్పు కలిగించాలన్న ఉద్ధేశ్యంతో 2009, నవంబర్ 29న తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో డిసెంబర్ 3వ తేదీన అమరుడయ్యాడు.
మండలంలోని పొడిచేడుకు చెందిన కాసోజు వెంకటాచారి-శంకరమ్మ దంపతుల పెద్ద కుమారుడు శ్రీకాంతాచారి. రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో శ్రీకాంతాచారి ఆత్మార్పణ చేసుకుని చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఆయన త్యాగంను మరువకుండా ప్రతి ఏడాది టీఆర్ఎస్ వర్ధంతిని నిర్వహిస్తున్నది. ఉద్యమ వీరుల అమరత్వం వృథాగా పోకుండా స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నది. అమరులందరి కుటంబాలకు అండగా నిలిచింది. ప్రతి అమరుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించిన ప్రభుత్వం కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయ అందజేసింది.
నేడు పొడిచేడులో వర్ధంతి సభ
శ్రీకాంతాచారి స్వగ్రామం పొడిచేడులో ఆయన వర్ధంతి సభను టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు నిర్వహిస్తున్నారు. సంతాప సభకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో పాటు పలువురు హాజరు కానున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని టీఆర్ఎస్కు చెందిన ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్ కోరారు.