తిరుమలగిరి, డిసెంబర్ 21 : దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండల కేంద్రానికి రూ.50కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేసింది. ఇప్పటికే దళిత బంధు పథకంపై జిల్లా కలెక్టర్ గ్రామసభలు నిర్వహించి యూనిట్ల ఎంపిక విషయంలో అవగాహన కల్పించారు. ఈ మేరకు త్వరలోనే దళితుల బ్యాంకు ఖాతాల్లో రూ.10లక్షలు జమకానున్నాయి. తిరుమలగిరి మండలానికి రూ.250కోట్లు మంజూరు చేయగా మొదటి విడుతగా రూ.50కోట్లు విడుదల చేసింది. విడుతల వారీగా మొత్తం 2,500 కుటుంబాలకు దళిత బంధు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కొంత ఆలస్యమైనా దళితుల అభివృద్ధి పట్ల సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ముందుకు సాగడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
త్వరలోనే దళితుల ఖాతాల్లోకి డబ్బులు..
రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు మొదటి విడుతగా రూ.50 కోట్లు విడుదల చేసింది. వారం రోజుల్లో దళితుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లు గ్రౌండింగ్ చేస్తాం. ఇప్పటికే సర్వే కూడా పూర్తికావడంతో వారికి యూనిట్లు కేటాయించి వారి సంక్షేమం కోసం నిధులు వినియోగిస్తాం.
దళితుల గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్ ఒక్కరే…
దళితుల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఒక్కరే. గత ప్రభుత్వాలు మమ్మల్ని ఓటు బ్యాంకుగానే చూశాయి తప్ప.. మా బాగోగుల గురించి ఆలోచించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు దళితులు కష్టాలు, వారి బతుకులను అర్థం చేసుకుని దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఆయన దళిత పక్షపాతి. ఆయనకు రుణపడి ఉంటాం.