తుంగతుర్తి, అక్టోబర్ 27 : కల్లు గీత వృత్తిపై ఆధారపడి దుర్భర జీవనాన్ని కొనసాగిస్తున్న గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ‘గీతన్న బంధు’ ప్రకటించి కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కల్లుగీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎలుగూరి గోవిందు డిమాండ్ చేశారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో మండల అధ్యక్షుడు మద్దెల నరసయ్య ఆధ్వర్యంలో జిల్లా నాలుగవ మహా సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుళ జాతి కంపెనీల లిక్కర్, శీతల పానీయాల ఉత్పత్తుల దాటికి తట్టుకోలేక కల్లు అమ్మకాలు పడిపోయాయని, ఫలితంగా గీత వృత్తిలో ఉపాధి దొరకక బ్రతుకుతెరువు కోసం ఇతర పనులు వెతుక్కుంటూ పట్టణాలకు వలస బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఆసరా పెన్షన్లు, ఎక్స్గ్రేషియాతో సరిపెట్టకుండా ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర కల్లుగీత కార్పోరేషన్ కు ప్రభుత్వం రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని, 560 జీఓ అమలు చేసేంత వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం గీత కార్మికులు ర్యాలీ నిర్వహించి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మడ్డి అంజిబాబు, తుంగతుర్తి మండల అధ్యక్షుడు నరసయ్య గౌడ్ తణుకు సైదులు గౌడ్, ఆకుల రమేశ్, చిర్ర నరేశ్, గౌడ సంఘం నాయకులు తునికి సాయిలు, బుర్ర శ్రీనివాస్, గుండగాని అంజయ్య, గడ్డం ఉప్పలయ్య, సూదగాని రాజయ్య, మారగాని వెంకటయ్య, మల్లయ్య గౌడ్, ఉప్పలయ్య గౌడ్, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.