వేములపల్లి, జులై 10 : పారదర్శక ఓటరు జాబితా తయారీలో బీఎల్ఓల పాత్ర కీలకమని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గరువారం వేములపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో బీఎల్ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఓటరు జాబితా తయారీలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే జాబితా రూపొందించాలన్నారు. ప్రజాస్వామ్యానికి ఓటరు జాబితా ముఖ్యమని, అర్హులు మాత్రమే ఓటరుగా ఉండేలా చూడాలన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని బీఎల్ఓలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. శిక్షణ సందర్భంగా సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ హేమలత, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.