గరిడేపల్లి, జనవరి 3 : తీగజాతి కూరగాయల సాగుకు ప్రస్తుత సమయం అనుకూలమని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. చిన్న చిన్న మెళకువలు, సరైన యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే అధిక లాభాలు గడించవచ్చని చెప్తున్నారు. పందిర్లపై సాగు చేస్తే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చంటున్నారు. తీగ జాతి కూరగాయలైన సొర, బీర, కాకర, దోస, పొట్ల, దొండ సాగులో అవలంబించాల్సిన పద్ధతుల గురించి తెలుసుకుందాం.
విత్తన మోతాదు
ఎకరానికి సొర 0.6 నుంచి 0.8 కిలోలు, బీర 0.6 నుంచి 0.8 కిలోలు, కాకర 0.8 నుంచి ఒక కిలో వరకు, పొట్ల 0.6 నుంచి 0.8 కిలోలు, దోస కిలో నుంచి 1.4 కిలోలు, దొండ చూపుడు వేలు మందం కలిగి నాలుగు కణుపులు గల కాండం ముక్కలు 1333 నుంచి 2వేల వరకు అవసరమవుతాయి.
విత్తే దూరం
బీర, కాకర, దోస విత్తనాలను వేసవిలో రెండు వరుసలలో మొక్క మొక్కకు మధ్య దూరం పొడవు 2 మీటర్లు, ఒక వరుసలో మొక్క మొక్కకు మధ్య వెడల్పు 0.5 మీటర్లు ఉండాలి, సొర 2.5మీటర్ల పొడవు, అర మీటరు వెడల్పు ఉండాలి. దొండ, పొట్ల సాగులో పొడవులో 2 మీటర్లు, వెడల్పులో 1-2 మీటర్ల దూరం ఉండాలి.
ఎరువుల యాజమాన్యం
ఎకరానికి 6-8 టన్నుల మాగిన పశువుల ఎరువు లేదా 1.5 టన్నుల వానపాముల ఎరువు మరియు 4కిలోల పాస్పో బ్యాక్టీరియా, 4కిలోల అజోస్పైరిల్లమ్ను ఆఖరి దుక్కిలో వేయాలి.
రసాయనిక ఎరువులు : 32-40 కిలోల భాస్వరం, 16-20కిలోల పొటాష్, 32-40 కిలోల నత్రజనిని ఎకరానికి వేయాలి. భాస్వరం, పొటాష్ను పాదులలో వేయాలి. నత్రజనిని రెండు సమ భాగాలుగా చేసుకొని విత్తిన 25-30 రోజులకోసారి మరియు పూత, పిందె సమయంలో మరోసారి వేయాలి. వేసవిలో ఆడ పూలు ఎక్కువగా వచ్చేందుకు 2-4 ఆకుల దశలో లీటర్ నీటికి 2 గ్రాముల బోరాక్స్ను కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
సస్యరక్షణ చర్యలు
గుమ్మడి పెంకు పురుగు : ఇవి మొక్క మొలిచిన వెంటనే ఆశించి నష్టపరుస్తాయి. నివారణకు 2శాతం పాలిడాల్ పొడిని వారంలో రెండు సార్లు చల్లాలి. వీటి ప్రభావం ఎక్కువగా ఉంటే లీటర్ నీటికి ప్రొఫినోఫాస్ 2 మి.లీ. లేదా మలాథియాన్ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
పొట్లాకు పురుగు
ఇవి మొక్కల పెరుగుదల, పూత దశల్లో ఆకులను ఎక్కువగా కొరికివేస్తాయి. నివారణకు క్లోరోపైరిఫాస్ 2 మి.లీ. లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ. లేదా ఒక గ్రాము థయోడీకార్ప్ను లీటర్ నీటికి కలిపి పూతకు ముందు పిచికారీ చేయాలి.
పండు ఈగ
నివారణకు 10 లీటర్ల నీటికి 100 మి.లీ. మలాథియాన్ మరియు 100 గ్రాముల బెల్లం, 250 మి.లీ. బాగా పులిసిన కల్లును మట్టి మూకుళ్లలో పోసి (విషపు ఎర) పొలంలో అక్కడక్కడ పెట్టాలి.
పాము పొడ : నివారణకు ప్రారంభ దశలో 5శాతం వేపగింజల కషాయాన్ని చల్లాలి. లీటర్ నీటికి 2 మి.లీ. ప్రొపినోఫాస్ను పిచికారీ చేసినా మంచి ఫలితం ఉంటుంది.
బూజు తెగులు
నివారణకు లీటర్ నీటికి మాంకోజబ్ 2.5 గ్రాములు లేదా తీవ్ర దశలో ఉంటే రెడోమిల్ ఎం.జడ్ ఒక గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
బూడిద తెగులు
నివారణకు లీటర్ నీటికి ఒక మి.లీ. కెరాథేన్ లేదా ఒక గ్రాము డైనోకాప్ కలిపి పిచికారీ చేయాలి.
ఆకుమచ్చ తెగులు
నివారణకు లీటర్ నీటికి కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
వేరుకుళ్లు తెగులు (ప్యుజోరియం వేరుకుళ్లు) : దీనిని ఎండు తెగులు అని కూడా అంటారు. దీని ప్రభావం వల్ల తీగలు వాడిపోయి ఆకులు ఎండి రాలిపోతాయి. నివారణకు బోర్డో మిశ్రమం 1శాతం లేదా కాపర్ ఆక్సీ కోరైడ్ను 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్ల దగ్గర తడిచేటట్లు పది రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పోయాలి. ముందు జాగ్రత్తగా ఆఖరు దుక్కిలో ఎకరాకు 250 కిలోల వేప పిండిని వేసి బాగా కలియదున్నాలి. పంట వేసిన తర్వాత అయితే ట్రైకోడెర్మావిరిడే కల్చర్ను పశువుల ఎరువులో అభివృద్ధి చేసి మొక్కల పాదుల దగ్గర వేయాలి.
ఆంథ్రక్నోస్ తెగులు (పక్షికన్ను తెగులు) : దీని ప్రభావంతో ఆకులపై, కాయలపై గుండ్రని చిన్న మచ్చలేర్పడి ఎండి రాలిపోతాయి. కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజమ్ ఒక గ్రాము లేదా కార్బండిజమ్ + మాంకోజెబ్ కలిపిన మిశ్రమం రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
సాధారణంగా తీగ జాతి కూరగాయల మొక్కలు తేమతో కూడిన వేడి వాతావరణంలో బాగా పెరుగుతాయి. వీటి సాగుకు తేలికపాటి బంకమట్టి నేలలు అనుకూలం.
తీగ జాతి సాగు చాలా తేలిక
తీగజాతి కూరగాయల సాగు చాలా తేలిక. ఖర్చు కూడా తక్కువే. ఇవి ఎగబాకడానికి వెదురు కర్రలతో పందిర్లు వేసి వాటిపైకి ఎక్కేందుకు తాళ్లను కట్టాలి. పందిరి వేస్తే కాసిన కాయలు కిందికి వేళాడుతాయి. ఇలా వేళాడిన వాటిని తెంపడం సులభం. ఇలా పండించిన కూరగాయలు నాణ్యతగా ఉంటుండడంతో మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. ధర ఎక్కువగా వస్తుంది. ఫలితంగా రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
– సీహెచ్.నరేశ్, కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి