సీఎంఆర్ సేకరణలో కేంద్ర ప్రభుత్వం కిరికిరి చేస్తున్నది. ధాన్యం కొనకుండా కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుండడంతో మిల్లింగ్ ఆగిపోయింది. దాంతో మిల్లర్ల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో నెలన్నరగా ధాన్యం గోదాముల్లోనే మూలుగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాటిని కాపాడలేక మిల్లర్లు నానా యాతన పడుతున్నరు. ఉమ్మడి జిల్లాలో 210 మిల్లుల్లోని ధాన్యం ఎండకు ఎండి వానకు తడుస్తున్నది. దీంతో సుమారు రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం తడిచినట్లు అధికారుల అంచనా. ఆరుబయట ఉన్న ధాన్యం బస్తాల్లోంచే మొలకలు వచ్చి పైరును తలపిస్తున్నాయి. మిల్లులు నడవక ఈఎంఐలు, రెంట్లు, కరెంటు బిల్లులు చెల్లించలేక మిల్లర్లు అవస్థల్లో ఉన్నారు. ఇక మిల్లుల్లో పనిచేస్తున్న సిబ్బంది, హామాలీ కార్మికులు, ట్రాన్స్పోర్టు కార్మికుల ఉపాధిపైనా తీవ్ర ఎఫెక్ట్ పడింది. ఉపాధి దొరక్క అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇతర రాష్ర్టాల హమాలీ కార్మికులంతా తమ స్వస్థలాలకు దారిపట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నది.
వలిగొండ మండలం పులిగిల్లలోని ఓ మిల్లులో బస్తాల్లోనే మొలకెత్తిన వడ్లు
నల్లగొండ ప్రతినిధి, జూలై 18 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఎఫ్సీఐ సీఎంఆర్ సేకరణలో కొర్రీల మీద కొర్రీలు పెడుతూనే ఉంది. రైస్మిల్లుల్లో నిల్వల్లో తేడాలు ఉన్నాయన్న సాకులతో గత నెల 7 నుంచి పూర్తిస్థాయిలో సీఎంఆర్ సేకరణను నిలిపివేసింది. రాష్ట్రంలోని మూడునాలుగు జిల్లాల్లోనే ఈ సమస్య తలెత్తగా అన్ని జిల్లాల్లోనూ సీఎంఆర్ సేకరణను ఆపేసారు. పైగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా కూడా ధాన్యం నిల్వల్లో తేడాలు రాలేదు. ఇక్కడ తప్పు జరగకపోయినా అంతటా ఒకే శిక్ష అన్న తరహాలో ఎఫ్సీఐ వ్యవహరిస్తున్నది. ఎఫ్సీఐ అసంబద్ధ నిర్ణయాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 210 రైస్మిల్లుల్లో సీఎంఆర్ సేకరణ నిలిచిపోయింది. దాంతో ఈ మిల్లులన్నీ 41 రోజులుగా మూతపడ్డాయి. నల్లగొండ జిల్లాలో 100, సూర్యాపేట జిల్లాలో 70, యాదాద్రిభువనగిరి జిల్లాలో 40 పార్బాయిల్డ్ రైస్మిల్లులు తెరుచుకోవడం లేదు. ఫలితంగా ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి.
నల్లగొండ జిల్లాలోనే గతేడాది యాసంగి ధాన్యం 20వేల మెట్రిక్ టన్నులు, వానకాలం ధాన్యం 1.50 మెట్రిక్ టన్నులు, ఇటీవల యా సంగి ధాన్యం 3.27లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉన్నాయి. వీటితో పాటు గతేడాది యాసంగికి సంబంధించిన 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కూడా సిద్ధంగా ఉంది. ప్రస్తుతం సీఎంఆర్ సేకరణ నిలిపివేయడంతో ఇవన్నీ రైస్మిల్లుల్లోనే మూలుగుతున్నాయి. చాలా చోట్ల ఆరుబయట టార్పాలిన్ల కిందనే గుట్టలుగా ధాన్యం బస్తాలు ఉన్నాయి. ఇటీవల కురిస్తున్న వర్షాలతో ధాన్యమంతా తడిసిముద్దువుతున్నది. పక్షులు, ఎలుకలు కూడా బస్తాలకు రం ధ్రాలు చేస్తూ నష్టం కలిగిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నల్లగొండ జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నులకు పైగా, యాదాద్రి జిల్లాలో 30వేలు, సూర్యాపేట జిల్లాలో 70వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం తడిసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులోనూ చాలావరకు మొలకలు సైతం వచ్చినట్లు క్షేత్రస్థాయి పరిస్థితి స్పష్టం చేస్తున్నది.
తీవ్ర ఆందోళనలో…
ఎఫ్సీఐ తీరుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైస్మిల్లర్లంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 210 మిల్లుల్లు మూతపడడంతో పనిలేక తీవ్రంగా నష్టపోతున్నారు. మిల్లులు మూత పడినా కరెంటు బిల్లు చెల్లించక తప్పదు. బ్యాంకు ఈఎంఐలు, ఫైనాన్స్ కిస్తీలు, లీజులు ఇలా అనేక రకాలుగా చెల్లించాల్సి ఉండగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని రైస్మిల్లర్లు కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ సేకరణ వ్యవస్థపై ఆధారపడి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైస్మిల్లు సిబ్బంది, హమాలీలు, ఇతర కార్మికులంతా కలిసి 20వేల వరకు ఉంటారని అంచనా. వీరంతా 41 రోజులుగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రైస్ ఇండస్ట్రీస్లో ఎగుమతి, దిగుమతుల్లో కీలకమైన హమాలీలతో పాటు మిల్లు డ్రైవర్లు, గుమస్తాలు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, స్టేట్ వేర్ హౌసింగ్, సెంట్రల్ వేర్హౌసింగ్, ఎఫ్సీఐ గోదామ్ కార్మికులు కూడా పెద్దసంఖ్యలో ఉపాధి పొందుతున్నారు. ఎఫ్సీఐ నిర్ణయంతో వీరంతా ఉపాధికి దూరమయ్యారు. కొందరూ కార్మికులు అప్పులు చేసి జీవనం సాగిస్తున్నట్లు చెబుతున్నారు. తక్షణమే ఎఫ్సీఐ సీఎంఆర్ సేకరణను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
స్వగ్రామాలకు వెళ్తున్న కార్మికులు
రైస్ ఇండ్రస్ట్రీస్లో ప్రస్తుతం పెద్ద సంఖ్యలో బిహార్తో పాటు ఇతర రాష్ర్టాల కార్మికులే పనిచేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వీరి సంఖ్య మూడు నుంచి నాలుగు వేలకు పైగానే ఉంటుందని అంచనా. వీరిలో కొందరూ తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. మిగిలిన వారు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పలు మార్లు హామాలీ కార్మికులు ఆందోళనకు దిగారు. నల్లగొండలోని ఎఫ్సీఐ కార్యాలయాన్ని ముట్టడించారు. జిల్లా కలెక్టరేట్ల ఎదుట కూడా ధర్నాలు నిర్వహించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి సీఎమ్మార్ సేకరించాలని అన్నివర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్రం తీరుతో మిల్లర్లకు నష్టం
బియ్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో రైస్మిల్లర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లల్లోనే ఆసియా ఖండంలోనే నల్లగొండ జిల్లాలో అధికంగా ఉన్నాయి. మిల్లింగ్ చేసిన బియ్యన్ని ఎఫ్సీఐ తీసుకోక పోవడంతో మిల్లుల్లో బియ్యం, ధాన్యం నిల్వలు పెరుకు పోయాయి. రెండు నెలలుగా మిల్లింగ్ చేయడం లేదు. దానికి తోడు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ధాన్యం మొలకెత్తుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ తమ విధానాన్ని మార్చుకోవాలి.
– చిట్టిపోలు యాదగిరి, జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నల్లగొండ