కోదాడ, మార్చి 27 : కోదాడలో మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి విశ్రాంత ఉద్యోగుల క్రీడా, సాహిత్య, సాంస్కృతిక పోటీలు నిర్వహించడం అభినందనీయమని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా నుంచి రాష్ట్రస్థాయి క్రీడల్లో గెలుపొందిన విజేతలకు, పీఈటీలకు, కార్యక్రమ నిర్వహణ కన్వీనర్లను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ఎంతో కాలం సేవలందించి పదవీ విరమణ అనంతరం విశ్రాంతి తీసుకోకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య మాట్లాడుతూ.. కోదాడ పెన్షనర్ల సంఘం అనేక కార్యక్రమాలను చేపడుతూ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కోదాడ సంఘం చేపడుతున్న కార్యక్రమాలను చూసి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లు అనుసరిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ రెడ్డిని శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించారు. అనంతరం మార్చి నెలలో నిర్వహించే పెన్షనర్ల సామూహిక జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, కార్యదర్శి సుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని రంగారావు, జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, సెక్రటరీ బొల్లు రాంబాబు, సోమయ్య, రఘు వరప్రసాద్, శోభ, భ్రమరాంబ పాల్గొన్నారు.