రాజులు గతించారు. రాచరికాలు అంతరించాయి. కానీ.. అలనాటి చారిత్రక కట్టడాలు రాచకొండ ప్రాంతంతో ఇప్పటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. రేచర్ల పద్మ నాయకులు ఏలిన కొండ రాచకొండ. ఇది ఒకప్పటి తెలంగాణ ప్రాంతానికి రాజధానిగా విలసిల్లిన నగరం. 105 దేవాలయాలు, 3 దర్గాలు, కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులు, రాచకొండ గుట్ట చుట్టూ శత్రు దుర్భేద్యమైన రాతి కట్టడాలు, 200 అడుగుల నుంచి జాలువారే జలపాతాలు, ఎత్తయిన కొండలు, పక్షుల కిలకిలారావాలు, సెలయేటి చప్పుళ్లతో రాచకొండ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ హబ్గా ఏర్పాటు చేయడానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో రూ.10కోట్లతో పనులు చేపడుతున్నారు. ఇప్పటికే మొదటి విడుతలో రూ.80లక్షలతో పనులను ప్రారంభించారు. రాచకొండ ప్రాంతానికి మరింత వన్నె తెచ్చేవిధంగా ఈ ప్రాంతంలోని వందల ఏండ్ల నాటి మెట్ల బావిని అభివృద్ధి చేయడానికి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రణాళికలు రూపొందించారు. రాచకొండలోని మెట్ల బావిని సికింద్రాబాద్ బన్సీలాల్పేట మెట్ల బావిలా అభివృద్ధి చేస్తే పర్యాటకుల తాకిడి పెరుగడంతో పాటు రాచకొండ మరింత అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చారిత్రక కట్టడాల్లో ఆలయాల తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన నిర్మాణాలు మెట్ల బావులు. రాచకొండ ప్రాంతాన్ని పాలించిన రేచర్ల పద్మ నాయకులు నాడు తవ్వించిన మెట్ల బావులు నేటికీ చెక్కు చెదరకుండా దర్శనమిస్తున్నాయి. రేచర్ల పద్మనాయక రాజు వారసుడు అనపోతనాయుడు రాచకొండ దర్గా వద్ద ఒకటి, పెద్దమ్మ గుడి దగ్గర మరొకటి ప్రజల దాహర్తి తీర్చేందుకు మెట్ల బావులు నిర్మించాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఊట నీటితో నిండే ఈ చెరువుల్లోని నీటిని మోట ద్వారా పైకి తెచ్చి వ్యవసాయం చేసినట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అత్యంత పటిష్టంగా, అద్భుతమైన నైపుణ్యంతో నిర్మించిన ఈ మెట్ల బావిలో ఏడాది పోడవునా నీళ్లు ఉంటాయి. రాచకొండ దర్గా వద్ద ఉన్న మెట్ల బావికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కృషి చేస్తున్నారు. దాదాపు రూ.30లక్షలతో మెట్ల బావిని అభివృద్ధి చేయాడానికి ప్రణాళికలు రూపొందించి పనులు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా మెట్ల బావిలోని నీటిని భారీ మోటర్లతో తోడేస్తున్నారు. బావిలోని బురద, మట్టి, చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేస్తున్నారు. బావి చుట్టూ ఫెన్సింగ్, లైటింగ్ ఏర్పాటు చేసి త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకు రానున్నారు. మెట్ల బావిని అభివృద్ధి చేస్తుండడంతో పర్యాటక ప్రేమికులు, ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు రాచకొండకు పూర్వ వైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాచకొండ ప్రాంతాన్ని టూరిస్ట్ హబ్గా ఏర్పాటు చేయడంతోపాటు మెట్ల బావిని పునరుద్ధరిస్తుండడం గొప్ప విషయం. దీంతో రాచకొండ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాచకొండకు వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి.
– సూరపల్లి వెంకటేశ్, రాచప్ప సమితి ప్రధాన కార్యదర్శి
ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన రాచకొండ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. రాచకొండలోని దేవాలయాలను అభివృద్ధి చేసి టెంపుల్ సిటీగా మారుసా్ంత. దర్గా వద్ద ఉన్న ప్రాచీన మెట్ల బావికి పునర్వైభవం తీసుకురావడానికి రూ.30లక్షలతో అభివృద్ధి పనులు మొదలు పెట్టాం. త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. దాంతో రాచకొండకు పర్యాటకుల తాకిడి పెరుగడంతో ఉపాధి అవకాశాలు దొరుకుతాయని రాచకొండ గిరిజన ప్రజలు అనందం వ్యక్తం చేస్తున్నారు.
– ప్రభాకర్రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే