Dharani | దశాబ్దాలుగా భూ సమస్యలతో ఇబ్బంది పడిన రైతులకు ధరణి పోర్టల్ కొండంత ధైర్యాన్నిస్తున్నది. దళారుల ప్రమేయం లేకుండా, ఎవరినీ బతిమిలాడే బాధ లేకుండా, ఏ ఆఫీసు చుట్టూ తిరుగాల్సిన పని లేకుండా సేవలన్నీ ఒకే చోట అందిస్తున్నది. గతంలో కోదాడ, హుజూర్నగర్ వంటి పట్టణాల్లో రిజిస్ట్రేషన్లు జరుగగా ఇప్పుడు ఆయా తాసీల్దార్ ఆఫీసుల్లోనే చేస్తున్నారు. ఏండ్లకేండ్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా కాని పని కూర్చున్న చోటనే పూర్తవుతున్నది. ధరణి పోర్టల్లోనే భూముల విలువ, స్టాంప్ డ్యూటీ ధరలు చూపిస్తుండడంతో అధిక వసూళ్లకు చెక్ పడింది. అరగంటలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి పట్టా కాగితం చేతిలో పెడుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధరణి దరఖాస్తులను జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నది. మ్యుటేషన్, సక్సెషన్, పాస్ పుస్తకాల్లో డాటా కరెక్షన్ వంటి పనులు చకచకా జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 32,207 దరఖాస్తులు రాగా 31,293(99.68 శాతం) పూర్తి చేశారు. ధరణి లేకపోతే తమ భూముల సమస్యలు పరిష్కారం కాకపోయేవని, సీఎం కేసీఆర్ మేలును మరువలేమని రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
– సూర్యాపేట, మే 28 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, మే 28 (నమస్తే తెలంగాణ) : నిజాం కాలంలో పెట్టిన భూ హద్దులు.. అస్తవ్యస్తంగా ఉన్న సర్వే నెంబర్లు.. భూమి ఒకచోట.. ఖాతా నెంబర్ మరో వద్ద ఉండడంతో గతంలో గ్రామాల్లో నిత్యం భూ తగాదాలు జరుగుతూ ఉండేది. ఆ తగాదాలతో కొట్లాటలు, హత్యలు చోటుచేసుకునేవి. వీటికి శాశ్వత పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ భూ రికార్డుల శుద్ధీకరణ చేపట్టారు. రికార్డుల ఆన్లైన్ పూర్తి చేసి ధరణి పోర్టల్లో నిక్షిప్తం చేయడంతోపాటు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించారు. గతంలో మాన్యువల్ రికార్డులు ఉండగా ఎవరి భూములు ఎవరికి సొంతమో తెలియని పరిస్థితి ఉండేది. అంతేకాకుండా ప్రభుత్వ భూములను పట్టా చేసుకున్న భూ బకాసురులు కోకొల్లలు. అయితే.. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని బ్లాక్ చేయడంతోపాటు ధరణిలో సర్కారు భూములుగా నమోదు చేశారు. ఇక భూములకు రికార్డులు సరిగా లేని రైతుల సంఖ్య పెద్దగానే ఉండగా అన్నింటికీ హక్కులు కల్పిస్తూ ధరణిలో నమోదవుతూ వస్తున్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ అంటే ఓ ప్రహసనం కాగా, మ్యుటేషన్ చేయించుకోవడానికి నెలలు, సంవత్సరాలు పట్టేది. ధరణి వచ్చాక నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్.. ఆ వెంటనే మ్యుటేషన్ పూర్తయి పత్రాలు చేతిలో పడుతున్నాయి.
అవసరాన్ని బట్టి మాడ్యూల్స్
కొత్తగా ఆన్లైన్ ధరణి పోర్టల్ తీసుకురాగా రకరకాల కారణాలతో సమస్యలు ఉన్న భూములు ఆన్లైన్లోకి ఎక్కకపోవడంతో అందుకనుగుణంగా మాడ్యుల్స్ తీసుకొస్తున్నారు. ధరణి ప్రారంభం అయిన తరువాత రెండేండ్ల కాలంలో 33 మాడ్యూల్స్ తీసుకొచ్చారు. దీంతో ధరణితో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయే రైతుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.
99.68 శాతం సమస్యల పరిష్కారం
జిల్లాలో ధరణి సమస్యలు పరిష్కారమవుతూ ప్రస్తుతం 99.68 శాతం భూముల ఆన్లైన్ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 2,89,706 మంది రైతులు ఉండగా ధరణి ప్రారంభమైన తరువాత దాదాపు 91 శాతం మంది రైతుల భూముల ఆన్లైన్ పూర్తయింది. తదనంతరం అవసరాన్ని బట్టి మాడ్యూల్స్ రావడంతో నేడు 99.68 శాతానికి చేరుకుంది. ఆన్లైన్లో రైతుల భూముల నమోదు పూర్తవుతూ వస్తున్న క్రమంలో మ్యుటేషన్, సక్సేషన్, పాస్ పుస్తకాల్లో డాటా కరెక్షన్ తదితరాల కోసం 32,207 దరఖాస్తులు రాగా, 31,293 క్లియర్ అయ్యాయి. 914 దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో దశాబ్దాల తరబడి ఉన్న భూ సమస్యలు పరిష్కారం అవుతూ ధరణి ద్వారా మండల కార్యాలయాల్నో అత్యంత సులువుగా రిజిస్ట్రేషన్లు అవుతుండడం పట్ల రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
దూరం పోయే బాధ తప్పింది
నాకు రామాపురంలో ఐదు ఎకరాల పొలం ఉంది. నాకు ఇద్దరు కొడుకులు. అందులో చెరో రెండు ఎకరాలు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించిన. గతంలో ఈ పనికి కోదాడకు పోవాల్సి వచ్చేది. రెండు, మూడు రోజులు పని చెడేది. ఇప్పుడు రిజిస్టేషన్ కాంగనే డమ్మీ పాస్ పుస్తకం ఇచ్చిండ్రు. 15 రోజుల్లో ఇంటికే పాసు పుస్తకం పంపిస్తామన్నారు. ధరణి వచ్చినంక రైతులకు భూ సమస్యలు లేవు. భూములు అమ్మినా, కొన్నా వెంటనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. దూరం పోయే బాధ లేకుండా తాసీల్దార్ ఆఫీసులోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నరు. చాలా సంతోషంగా ఉంది.
– కొడారి నర్సింహారావు, రైతు, రామాపురం, మేళ్లచెర్వు మండలం
దళారులు లేకుండా రిజిస్ట్రేషన్లు చూస్తున్నాం
మా ఊర్లో వారసత్వంగా వచ్చిన భూమిని మా తమ్ముడికి కొంత రిజిస్ట్రేషన్ చేయించేందుకు తాసీల్దార్ కార్యాలయానికి వచ్చాం. అర్ధగంటలోనే పని పూర్తయింది. ఇద్దరు సాక్షులను తీసుకొచ్చి రిజిస్ర్టేషన్ చేయించుకున్నాం. వెంటనే పట్టా మార్పిడి అయింది. ఆన్లైన్ పట్టా పాస్పుస్తకం సైతం ఇచ్చారు. నెల రోజుల్లోపు పట్టాదారు పాస్పుస్తకం నేరుగా ఇంటికి వస్తుందన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయినంక వెంటనే ఆన్లైన్లో చూపించింది. గతంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ దళారులు ఉండేవారు. ఎవరికైనా పని ఉండి అక్కడకు వెళ్తే జలగల్లా పట్టి పీడించేవాళ్లను చూశాం. తప్పనిసరి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నెలలు, సంవత్సరాలు ఎదురుచూసిన రోజులున్నాయి. అప్పటికే ఆ భూమిపై కబ్జాలో ఉన్నప్పటికీ ఆన్లైన్లో మాత్రం భూమి అమ్మిన వాళ్ల పేర్లు ఉండేవి. కొంతమంది అధికారులు చేసిన తప్పిదాలతో ఇలా జరిగేది. ఇప్పుడు పొరపాట్లు చేయడానికి అవకాశం లేదు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ సామాన్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. దీంతో గ్రామాల్లో భూముల సమస్యలు, గొడవలు, కొట్లాటలు లేకుండా పోయాయి.
– మొండికత్తి జానయ్య, దురాజ్పల్లి, చివ్వెంల మండలం
ఇబ్బందుల్లేకుండా భూమి రిజిస్ట్రేషన్
ధరణి పోర్టల్తో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, లంచాలు ఇవ్వకుండా భూముల రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాంటే రోజు మొత్తం కేటాయించుకొని 20 కిలోమీటర్ల దూరమున్న హుజూర్నగర్ వెళ్లాల్సి వచ్చేది. అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని డాక్యుమెంట్లు తీసుకొచ్చి మా పేరు మీద రికార్డులో ఎక్కించుకోవడానికి తాసీల్దార్ కార్యాలయంలో నానా ఇబ్బందులు పడేవాళ్లం. వీఆర్వోలకు ఇచ్చి రికార్డులో ఎక్కించమంటే వారు నిర్లక్ష్యం చేసేది. ఆ తరువాత ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు మనం ఆ భూమిని అమ్ముకున్నప్పుడు చూస్తే రికార్డుల్లో ఉండేది కాదు. ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకున్న మరుసటి రోజే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతగా తాసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. నిమిషాల్లోనే భూమి కొన్నవారి పేరు మీదకు మారుతుంది. ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
– అజ్మీర సైదమ్మ, జగన్నాథతండా, నేరేడుచర్ల
నకిలీ రిజిస్ట్రేషన్లకు అవకాశం లేదు
గతంలో దళారులు భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు. ఇప్పుడు ధరణి వల్ల నకిలీ రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకుండా పోయింది. ఇన్నాళ్లు పట్టణాలకు, నగారాలకు పరిమితమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రస్తుతం మండల కేంద్రాలకు అందుబాటులోకి వచ్చింది. తాసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ సరళమైన విధానం ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రైతులకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరం.
– బత్తుల సురేశ్, చిల్పకుంట్ల, నూతనకల్ మండలం
డబ్బులిచ్చుకోలేక కాయితాలు కూడా తీసుకోకపోయేది
ఏండ్ల తరబడి భూమిపై ఉండి వ్యవసాయం చేసుకుంటున్నా హక్కు కాగితాలు ఇవ్వలేదు. కాయితాలు అడిగితే డబ్బులు అడిగేది. డబ్బులిచ్చుకోలేక కాయితాలు కూడా తీసుకోకపోయేది. ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఆ కాయితం కావాలి.. ఈ కాయితం కావాలంటూ తిప్పించుకునేది. ఏండ్ల తరబడి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగినా రిజిస్ట్రేషన్, పాస్బుక్కులు చేతికి అందేది కాదు. భూమి రిజిస్ట్రేషన్, పాసుపుస్తకాల కోసం అధికారులకు డబ్బులు ఇచ్చి వాళ్ల చుట్టూ తిరిగినా పనులు కాకపోయేవి. ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి ప్రవేశపెట్టడంతో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యాలయంలో చూస్తుండగానే భూములు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి.
– సింగారపు కాశయ్య, తాళ్లకాంపాడ్, సూర్యాపేట జిల్లా
ధరణి పోర్టల్తో పని త్వరగా అయింది
ధరణి పోర్టల్తో మా పొలం రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తయింది. మా ఊర్లో మా నాయనమ్మకు ఉన్న ఎకరం పొలం స్థానిక తాసీల్దార్ కార్యాలయంలో ఇటీవల నా పేర రిజిస్ట్రేషన్ చేసింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరాయి. ఇంతకుముందు మా తాతలు, బంధువులు పొలాలు అమ్ముకోవాలన్నా, కొనాలన్నా కోదాడలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్లేది. ఆ కాగితం లేదు.. ఈ కాగితాలు లేవు అని అధికారులు వారాలు, నెలలపాటు తిప్పేవారు. చివరకు అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్తేనే పని అయ్యేది. ఇప్పుడా పరిస్థితి లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు తప్ప ఎక్కడా ఖర్చు కాలేదు. దూరం పోకుండా మండల కేంద్రంలోనే పని పూర్తి చేసుకున్నాం. అన్నదాతలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– బడేటి లింగరాజు, తెల్లబెల్లి, నడిగూడెం మండలం
అరగంటలోనే రిజిస్ట్రేషన్.. ఆ వెంటనే మ్యుటేషన్
ధరణి పోర్టల్తో రైతులకు ఎంతో మేలు జరుగతుంది. స్లాట్ బుక్ చేసుకుంటే వెంటనే రిజిస్ట్రేషన్తోపాటు మ్యుటేషన్ పూర్తి అవుతుండటంతో రైతులకు తాసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగే బాధ తగ్గింది. ఒకప్పుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పొలం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మ్యుటేషన్ కోసం నెలల తరబడి తాసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగాల్సి వచ్చేది. అయినా పొలం రికార్డులో నమోదు కాకపోవడం, తప్పుల తడకగా నమోదయ్యే పరిస్థితి ఉండేది. ధరణి పోర్టల్తో తాసీల్దార్ కార్యాలయంలోనే భూ మార్పిడి జరుగుతుంది. నేను మార్చి నెలలో 20 గుంటల పొలం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్కు స్లాట్ బుక్ చేసుకున్న. తరువాతి రోజు తాసీల్దార్ కార్యాలయానికి వెళ్తే అరగంటలోనే రిజిస్ట్రేషన్తోపాటు మ్యుటేషన్ పూర్తి చేసి పాసుపుస్తకంలో ఎక్కించారు. దీంతో తాసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగే బాధ తప్పింది.
– తమ్మనబోయిన శ్రీను, రైతు, నారాయణపురం, చిలుకూరు మండలం
ధరణితో సమస్యలన్నీ దూరమయ్యాయి
గతంలో ఏదైనా చిన్న భూమి సమస్య పరిష్కారం కావాలంటే అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగాల్సి వచ్చేది. మహానుభావుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి వెబ్సైట్ ప్రవేశపెట్టి రైతుల భూ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నారు. గతంలో ఏదైనా చిన్న సమస్య ఉన్నా రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగి అధికారులను కాళ్లవేళ్లా పడాల్సి వచ్చేది. ఇప్పుడు ధరణితో ఎలాంటి భూ సమస్య ఉన్నా క్షణాల్లో పరిష్కారమవుతుంది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే పట్టాదారు పాస్బుక్ రావడానికి నెలల తరబడి సమయం పట్టేది. నేడు స్లాట్ బుక్ చేసుకొని ఇద్దరు సాక్షులతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే తాసీల్దార్ కార్యాలయంలో పావుగంటలో పాస్బుక్ వస్తుంది. వెంటనే రైతుబంధు, రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధరణిని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్కు ధన్యావాదాలు.
– కానుగ దుర్గయ్య, రైతు, తుమ్మలపెన్పహాడ్, ఆత్మకూర్(ఎస్)