సూర్యాపేట టౌన్, మే 04 : సూర్యాపేట జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు రూ.20 లక్షల విలువ గల 103 ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ రికవరీ మేళాలో ఎస్పీ నరసింహ సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ ఏడాదిలో 1,635 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహా డబ్బులను కూడా కోల్పోతున్నారన్నారు. ఒక్కో మొబైల్ రికవరీ చేయడానికి సైబర్ వారియర్స్ పోలీస్, టెక్నికల్ టీం, పోలీసు సిబ్బంది చాలా కృషి చేశారన్నారు. ఇతర రాష్ట్రాల వారి నుండి ఈ మొబైల్స్ ను రికవరీ చేసినట్లు తెలిపారు.
పోలీసు ప్రజల ఆస్తుల రక్షణలో అణుక్షణం ప్రజల పక్షాన పని చేస్తుందన్నారు. తప్పుడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు, నేరాలకు పాల్పడే వారికి ఫ్రెండ్లీ పోలీస్ ఉండదని స్పష్టం చేశారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సిఇఐఆర్ పోర్టల్ (https://www.ceir.gov.in ) నందు నమోదు చేసుకోవాలన్నారు. మొబైల్ ను బ్లాక్ చేసి, మీ సేవా ద్వారా ధరఖాస్తు చేసి సంభందిత పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో వివిధ రూపాల్లో వినియోగదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ను సి ఇ ఐ ఆర్ అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐ.టి కోర్ సిబ్బందిని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.