ఏండ్ల తరబడి ఏదో ఒక గ్రామపంచాయతీకి ఆవాసంగా ఇతరుల ఏలుబడిలో ఉన్న తండాలు నేడు అస్థిత్వ పతాకను ఎగురవేస్తున్నాయి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి నిధుల వరద పారిస్తుండడంతో ప్రగతి పరుగులు తీస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు గిరిజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూడగా, బీఆర్ఎస్ సర్కారు అన్ని విధాలా బాధ్యతగా భరోసా కల్పిస్తున్నది. అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ సమగ్ర వికాసానికి పాటు పడుతున్నది. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో రిజర్వేషన్ల పెంపు, గురుకులాలు, గృహవినియోగానికి ఉచిత కరెంట్తో గిరిజనుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గిరిజన దినోత్సవం నిర్వహించనున్నారు. దేవరకొండలో 10 వేల మంది గిరిజనులతో సభ ఏర్పాటు చేస్తున్నారు.
– నల్లగొండ, జూన్ 16
నల్లగొండ, జూన్ 16 : జిల్లాలోని తండాలు ఏండ్ల తరబడి ఏదో గ్రామ పంచాయతీ కింద ఆవాసంగా ఉంటూ ఇతరుల ఏలుబడిలో ఉండేవి. ఫలితంగా తండాలు అభివృద్ధికి ఆమడ దూరంగా నిలిచేవి. వంద శాతం గిరిజనులు ఉన్న తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలు చేయాలన్న డిమాండ్ ఉద్యమ సారథి సీఎం కేసీఆర్ కార్యరూపం దాల్చింది. ప్రస్తుతం 500 జనాభా ఉన్న తండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఫలితంగా జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 173 గ్రామాలకు గిరిజనులే సర్పంచులుగా ఆ ఊరిని ఏలుతున్నారు. విద్య, ఉద్యోగాల్లో 6శాతం ఉన్న రిజర్వేషన్ను ప్రభుత్వం 10శాతానికి పెంచింది. అంతేగాక ప్రతి పంచాయతీకి పల్లె ప్రగతి కింద సర్కార్ జనరల్ నిధులతో పాటు ఎస్టీ సబ్ప్లాన్ కింద అదనంగా నిధులు ఇవ్వటంతో జిల్లాలోని గిరిజనులకు ప్రతినెలా రూ.1.26కోట్లు అదనంగా వస్తున్నాయి. దీంతో పాటు గిరిజన బిడ్డలకు గురుకులాల్లో నాణ్యమైన విద్య, పోడు భూముల పట్టాలతో సీఎం కేసీఆర్ పాలనలో ఎంతో మేలు జరిగిందని చెప్పవచ్చు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించే గిరిజన దినోత్సవంలో జిల్లాలోని అన్ని గిరిజన గ్రామ పంచాయితీల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ దేవరకొండలో 10వేల మంది గిరిజనులతో సభ నిర్వహించనున్నారు.
అన్ని గిరిజన గ్రామాల్లో గిరిజనోత్సవం
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని 173 గిరిజన గ్రామ పంచాయతీల్లో పాలకవర్గం, అధికారుల సమన్వయంతో శనివారం గిరిజనోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ప్రతి గ్రామ పంచాయతీలోనూ ర్యాలీలు తీసి బోగు బండారు పూజ చేసి జాతీయ జెండాను ఆవిష్కరిస్తాం. గిరిజనులకు ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రగతి నివేదికలో వివరిస్తాం. అదే విధంగా దేవరకొండలో గిరిజనోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున గిరిజనులతో సభ నిర్వహించనున్నాం.
-రాజ్కుమార్, గిరిజన శాఖ జిల్లా అధికారి, నల్లగొండ
స్వయంపాలనలో ఆనందమయం
గిరిజనుల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడంతో జిల్లాలో కొత్తగా 173తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. వీటిలో 104 గ్రామ పంచాయతీల్లో 100శాతం మంది గిరిజనులు ఉండగా మిగిలిన 69గ్రామ పంచాయతీల్లో కొంత మేరకు ఇతర కులాల వారు ఉన్నారు. అయితే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో నూతనంగా ఏర్పడ్డ ఈ 173 గ్రామాలు గిరిజనులకే రిజర్వేషన్ కావడం తో అన్ని గ్రామాల్లోనూ వారే సర్పంచులు, ఎంపీటీసీలుగా ఎన్నికై స్వయంపాలనలో అభివృద్ధి చేసుకుంటున్నారు. 104పంచాయతీల్లో భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.20.80కోట్లు మంజూ రు చేసింది. అవి గ్రౌండింగ్ పూర్తై నిర్మాణ దశలో ఉన్నాయి.
గిరిజన జీపీలకే ప్రగతి నిధులెక్కువ
బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకొచ్చాక పల్లె ప్రగతి పేరుతో ప్రతినెలా గ్రామాల అభివృద్ధికి నిధులు అందిస్తున్నది. ఈ నిధులు జిల్లావ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా పరిషత్ ద్వారా ప్రతి నెలా రూ.20కోట్లు వస్తున్నాయి. గ్రామంలో సాధారణంగా ప్రతి వ్యక్తికి రూ.80చొప్పున కేటాయిస్తుండగా ఎస్టీ సబ్ ప్లాన్ కింద ప్రభుత్వం ఈ రూ.80తో పాటు ప్రతి గిరిజనుడికి మరో రూ.120 చెల్లిస్తున్నది. (ఇతర కులాలు సర్పంచులుగా ఉన్న చోట జీపీకి ఏదేని ఒక నెలలో రూ.80వేలు వస్తే ఎస్టీ జీపీలో రూ.2లక్షలు వస్తున్నాయి). ఈ తరహాలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 2011జనాభా లెక్కల ప్రకారం గిరిజనులు స్త్రీ, పురుషులు కలిపి 81,325 మంది ఉండగా వారికి ఎస్టీ సబ్ ప్లాన్ కింద ప్రగతి నిధులు ప్రతి నెల సాధారణంతో కలిపి రూ.1.26కోట్లు వస్తున్నాయి. ప్రభుత్వం పల్లె ప్రగతి మొదలెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గిరిజన గ్రామాలకు ఈ తరహాలో రూ.55.69కోట్లు వచ్చాయి.
నేడు గిరిజన జీపీల్లో గిరిజనోత్సవం
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం గిరిజనోత్సవం నిర్వహించనున్నారు. దీంతో జిల్లాలోని 173 గిరిజన గ్రామ పంచాయతీల్లో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. తొలుత అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ర్యాలీ తీస్తారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బోగు బండార్ పూజ(సంత్ సేవాలాల్ జయంతి రోజు చేసే పూజ)చేసి జాతీయ జెండాను ఎగురువేస్తారు. అనంతరం గ్రామాభివృద్ధికి సంబందించిన నివేదిక చదివి ఆ గ్రామంలో ఐదుగురు పెద్దలను సన్మానిస్తారు. ఈ సందర్భంగా దేవరకొండలో పెద్ద ఎత్తున 10వేల మంది గిరిజనులతో గిరిజనోత్సవం నిర్వహించనున్నారు.
6నుంచి 10శాతానికి రిజర్వేషన్ పెంపు
విద్య, ఉద్యోగాల్లో తమ రిజర్వేషన్ పెంచాలనేది ఎప్పటి నుంచో గిరిజనుల డిమాండ్. దీన్ని సైతం గత పాలకులు పట్టించుకోలేదు. దీంతో తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం 6శాతమున్న రిజర్వేషన్ను 10శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి అమలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యా విభాగంలో ఈ రిజర్వేషన్ అమలవుతుండగా ప్రభుత్వం ప్రస్తుతం కండక్ట్ చేస్తున్న ఉద్యోగాల్లోనూ అమలు చేసేలా చర్యలు చేపడుతున్నది. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచనతో జిల్లాలో 18 గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసి అందులో 11గురుకులాలను ఇంటర్మీడియట్కు అప్గ్రేడ్ చేసి ఏడాదికి రూ.1.25లక్షలు వెచ్చించి 12,160 మందికి నాణ్యమైన విద్య అందిస్తున్నది. అంతేగాక ఏండ్ల తరబడి గిరిజనులు సాగు చేస్తున్న 5,600 ఎకరాలకు సంబంధించిన పోడు భూములను సైతం అర్హులైన 2,928మంది గిరిజన కుటుంబాలకు త్వరలో పట్టాలు ఇవ్వటానికి సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది.