రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. గ్రామాలు, పట్టణాల్లో సభలు ఏర్పాటు చేసి ఐదు పథకాల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నది. డిసెంబర్ 31,
జనవరి 1 సెలవు దినాలు పోగా మొత్తం ఎనిమిది రోజులపాటు కొనసాగనున్న కార్యక్రమానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి మండలానికి తాసీల్దార్, డిఫ్యూటీ తాసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంఈఓల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ప్రతి మండలంలో నిత్యం రెండు గ్రామాల్లో సభలను నిర్వహించేలా షెడ్యూల్ను రూపొందిస్తున్నారు. దరఖాస్తు పత్రాలను ప్రజలకు వివిధ శాఖల సిబ్బందితో ప్రభుత్వమే అందించి స్వీకరించే ఏర్పాట్లు చేసింది.
ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించిన తర్వాత గ్రామ సభను ప్రారంభించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. దరఖాస్తుల స్వీకరణ కోసం 100 కుటుంబాలకు ఒక కౌంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా స్వీకరించిన దరఖాస్తులను ఏ రోజుకారోజు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు, 4,322 వార్డులు, ఐదు మున్సిపాలిటీల్లో 141 వార్డులు ఉన్నాయి. మున్సిపాలిటీల కోసం 14, గ్రామీణ ప్రాంతాల్లో 37 కలిపి మొత్తం 51 బృందాలను ఏర్పాటు చేశారు.
దరఖాస్తుల స్వీకరణ కోసం 1961 కౌంటర్లను సిద్ధం చేశారు. ప్రజల నుంచి స్వీకరించే దరఖాస్తు ఫారాలను సైతం ప్రభుత్వమే ఉచితంగా అందజేయనున్నది. దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, తెల్లరేషన్ కార్డు జీరాక్స్లను జత చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేకుంటే దరఖాస్తులో లేదని రాయాల్సి ఉంటుంది. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా..ప్రస్తుతానికి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ గృహాలు, చేయూత పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నది.
నల్లగొండ, డిసెంబర్ 27 : నేటి నుంచి జనవరి 6 వరకు నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమానికి ఆర్వీ కర్ణన్ను బుధవారం ప్రభుత్వం ఉమ్మడి జిల్లా నోడల్ అధికారిగా నియమించింది. కర్ణన్ ఇటీవల వరకు నల్లగొండ కలెక్టర్గా పనిచేసి రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్గా బదిలీపై వెళ్లారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా పాలన ద్వారా వచ్చిన దరఖాస్తులను కర్ణన్ నేతృత్వంలో పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు.