వానకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. వచ్చే నెల రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నది. వానకాలం సీజన్లో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 4,27,964 ఎకరాల్లో వరి సాగు చేయగా 10,61,144 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మిల్లర్ల కొనుగోలుతోపాటు స్థానిక అవసరాలు 5.61 లక్షల మెట్రిక్ టన్నులు పోగా ప్రభుత్వ రంగ మార్కెట్లకు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నది. దీనికనుగుణంగా ఏర్పాటు చేసే 274 ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో టార్పాలిన్లు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, తూకం యంత్రాలు, గన్నీ బ్యాగులను ఆయా శాఖలు సమకూర్చనున్నాయి. సర్కారు నుంచి ధాన్యం డబ్బులు త్వరగా పడేలా, ఇతర రాష్ర్టాల ధాన్యం ఇక్కడికి రాకుండా ఈ సారి కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఆధార్ కార్డును లింక్ చేసి బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు తీసుకోనున్నారు.
నల్లగొండ, సెప్టెంబర్ 24: వానకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెల రెండో వారం నుంచే ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో కొనుగోళ్లు జరుగనుండగా టార్పాలిన్లు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, తూకం యంత్రాలు, గన్నీ బ్యాగులతో పాటు ఇతర సామగ్రిని ఆయా శాఖలు సమకూర్చనున్నాయి. ఈ ఏడాది వానకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,27,964 ఎకరాల్లో వరి సాగు చేయగా 10,61,144 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చని వ్యవసాయం శాఖ అంచనా వేసింది. ఇందులో మిల్లర్లు కొనుగోలు చేసేవాటితో పాటు స్థ్దానిక అవసరాలకు 5.61 లక్షల మెట్రిక్ టన్నులు పోనూ ప్రభుత్వ రంగ మార్కెట్లకు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా. దీనిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో వచ్చే నెల రెండో వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సారి ధాన్యం కొనుగోలు చేసే రైతుల ఆధార్ కార్డును లింక్ చేసి బయోమెట్రిక్ వేసే విధంగా కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలో ఈ ఏడాది 4.27 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా స్థానిక అవసరాలు, మిల్లర్ల కొనుగోళ్లు పోనూ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వ రంగ సంస్థలకు వచ్చే అవకాశం ఉంది. దాంతో అక్టోబర్ తొలి వారంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రెండో వారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కలెక్టర్, అదనపు కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి టాస్క్ ఇచ్చింది. కొనుగోళ్లు గ్రామీణాభివృద్ధి, సహకార శాఖలు చేపడుతుండగా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, ప్యాడీ క్లీనర్లు, తూకం, తేమ యంత్రాలు మార్కెటింగ్ శాఖ సమకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక తేమ పరిశీలన వ్యవసాయశాఖ, తూకం యంత్రాలపై స్టాంపింగ్ తూనికలు కొలతల శాఖ అధికారులు చేస్తారు. మొత్తంగా 1.25 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమై ఉండగా ప్రస్తుతం 72 లక్షలు అందుబాటులో ఉన్నాయని, మిగిలినవి త్వరలో తెప్పిస్తామని సివిల్ సైప్లె అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని పలు మిల్లుల్లో గత సీజన్కు సంబంధించిన సీఎమ్మార్ ఉండగా వచ్చే నెల నాటికి వాటిని క్లియర్ చేయించే విధంగా సివిల్ సైప్లె శాఖ ఏర్పాట్లు చేస్తున్నది.
జిల్లా వ్యాప్తంగా వానకాలం ధాన్యం కొనుగోలుకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఐకేపీ, సహకారశాఖ ఆధ్వర్యంలో పీఏసీఎస్ల ద్వారా 274 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ధాన్యం కొనేది రెండు శాఖలే అయినా మొత్తంగా 15 శాఖలు ప్రక్రియను నిర్వర్తించనున్నాయి. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి కూడా ధాన్యం మద్దతు ధరను పెంచింది. గత వానకాలంలో ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2060 ఉండగా ఈ సారి రూ.2203, కామన్ గ్రేడ్ రకానికి రూ.2183 గా నిర్ణయించింది. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి 17శాతం తేమ ఉండేలా తీసుకొని వచ్చి మద్దతు ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
ధాన్యం కొనుగోలులో నిబంధనలు పాటిస్తూ రైతులకు మద్దతు ధర అందించటంతో పాటు ఆ డబ్బులు సైతం ఎప్పటికప్పుడు వారి బ్యాంక్ ఖాతాలో వేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభు త్వం సూచించిన నేపథ్యంలో ఆ దిశగా అధికారు లు ఏర్పాట్లు చేశారు. ఈ సారి ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరుగకుండా చూడడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యానికి చెక్ పెట్టేందుకు రైతుల ఆధార్తో వారి వేలిముద్రలు లింక్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. దాంతో ప్రతి రైతు ఆధార్ కార్డును లింక్ చేసి బయోమెట్రిక్ వేశాకే వారి ధాన్యం తూకం వేయనున్నారు.
వానకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల క్వింటాళ్ల ధాన్యం మార్కెట్కు వచ్చే అవకాశం ఉంది. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు డీఆర్డీఏ, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 274 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే గన్నీ బ్యాగులు, తేమ, తూకం యంత్రాలు సేకరించే పని చేపడుతున్నాం. గత సీజన్ సీఎమ్మార్ కూడా పూర్తి చేస్తే మిల్లుల్లో ధాన్యం దిగుమతికి ఇబ్బంది ఉండదని భావించి ఆ దిశగా చర్యలు చేపడుతున్నాం.