పెన్పహాడ్, మార్చి 27 : ‘గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించి వందల కిలోమీటర్ల దూరంలో చిట్ట చివర ప్రాంతమైన పెన్పహాడ్ మండలానికి గోదావరి జలాలను తీసుకొచ్చి రాయి చెరువును నింపారు. నాలుగేండ్ల పాటు రాయి చెరువు నీటితో కళకళలాడుతూ మత్తడి దుంకింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో వెలవెలబోతున్నది’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మినీ రిజర్వాయర్ గుర్తింపు ఉండి ఎండిపోయిన మండలంలోని మాచారం రాయి చెరువును బుధవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాయి చెరువుతోపాటు చేతికొచ్చిన పొలాలు ఎండిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం, జిల్లా మంత్రులైన ఉత్తమ్, కోమటిరెడ్డి నిర్లక్ష్యమేనని అన్నారు. తమ ప్రభుత్వంలో జిల్లా అంతటా చెరువులు, కుంటల కింద ఉన్న పొలాల వెంట జాలువారి జమ్మి పుట్టేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత వైఖరి, సోయిలేనితనంతో చెరువులు నింపకుండా రైతులకు శిక్ష వేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. ఇతర పార్టీల వారిపై కేసులు, కొట్లాటలు, పార్టీ కండువాలు కప్పడానికి గేట్లు తెరిచారే తప్ప.. కాల్వల గేట్లు తెరిచి చెరువులు నింపాలనే సోయి లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన పిల్లర్లతో సంబంధం లేకుండా నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోలేదని, 5వేల పైబడి క్యూసెక్కుల నీళ్లు గోదావరిలో కలుస్తున్నాయని తెలిపారు.
ఈ వంద రోజుల్లో కనీసం 50 టీఎంసీల నీటిని ఎత్తిపోయించి ఉంటే పోచంపహాడ్ నుంచి పెన్పహాడ్ మండలానికి నీళ్లు వచ్చేవని, ఒక్క ఎకరం కూడా ఎండిపోయేది కాదని అన్నారు. కాళేశ్వరం నీళ్లు తెస్తే ఎక్కడ కేసీఆర్కు పేరు వస్తుందోనని రేవంత్రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి రైతాంగాన్ని నిలువునా ముంచిందని పేర్కొన్నారు. జిల్లా మంత్రులకు కనీసం అవగహన లేదు.. అవగాహన పెంపొందించుకోవాలన్న సోయి కూడా లేదని ఎద్దేవా చేశారు. గ్రామాల్లోకి వస్తే నిలదీస్తారని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి తప్పించుకొని తిరుగుతున్నారన్నారు.
దమ్ము ఉంటే, మొనగాళ్లు అయితే ఎండిపోయిన పొలాలను సందర్శించి రైతులకు ధైర్యం కల్పించాలని సవాల్ చేశారు. త్రివేణి సంగమంగా కృష్ణా, గోదావరి, మూసీ నీళ్లతో కళకళలాడిన పెన్పహాడ్ మండలంలో నేడు ఎండిన పంటలు దర్శనం ఇస్తున్నాయన్నారు. ఉమ్మడి జిల్లాలో సాగు చేసిన 3లక్షల ఎకరాలు పూర్తిగా ఎండిపోయాయని, 2014నాటి పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దగా, మోసం అన్నారు.
రైతులకు వెంటనే రూ.2లక్షల రుణమాఫీ చేయడంతోపాటు రైతు బంధు, ఎండిన పంటలకు ఎకరానికి రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం నారాయణగూడెంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన రైతు నారాయణ లింగారెడ్డి కుటుంబాన్ని, పొట్లపహాడ్లో అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నారాయణ రాంచంద్రారెడ్డిని పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ నెమ్మాది భిక్షం, సూర్యాపేట జడ్పీటీసీ జీడి భిక్షం, బీఆర్ఎస్ మండలాద్యక్షుడు దొంగరి యుగంధర్, పీఏసీఎస్ చైర్మన్ నాతాల జానకిరాంరెడ్డి, నాయకులు ఉన్నారు.