యాదగిరిగుట్ట, జనవరి 28 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారిని దివ్య మనోహరంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు. ఆలయ పశ్చిమ రాజగోపురం గుండా మాఢవీధుల్లో అరుణపారాయణాలు పఠిస్తూ సేవను ఊరేగించారు. తూర్పు రాజగోపురం వద్ద సేవను వేంచేపు చేసి స్వామివారి వైభవం, పుట్టు పుర్వోత్తరాలు, అలయ చరిత్రను ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనర్సింహాచార్యులు తెలిపారు. సాయంత్రం స్వర్ణ రథంపై స్వామివారిని వేంచేపు చేసి సేవను కొనసాగించారు. సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యుడి వాహనాన్ని స్వామివారు అధిరోహించి భక్తులకు కటాక్షించారు. యాదగిరిగుట్ట ఆలయ పునః ప్రారంభం అనంతరం తొలిసారిగా స్వామివారు సూర్య జయంతిని పురస్కరించుకుని ఉదయం సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం స్వర్ణరథంపై తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరుమాఢ వీధుల్లోకి చేరుకుని స్వామివారికి మంగళహారతులు పలికారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.గీత, ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహచార్యులు, డీఈఓ దోర్భల భాస్కర్ శర్మ, ఆలయాధికారులు రఘు, ముద్దసాని నరేశ్ పాల్గొన్నారు.
పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు రెండోరోజు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారి నిత్యారాధనల అనంతరం తిరుమంజన మహోత్సవం పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ప్రబంధ పాశురాలను పఠిస్తూ పురప్పాట్ సేవను నిర్వహించారు. స్వామివారి సేవను ఆలయంలో బాజాభజంత్రీలతో ఊరేగించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆళ్వారులు కీర్తించిన ప్రబంధాల్లోని పాశురాలను అనుసంధానం చేశారు. ప్రత్యేక రుత్వికులు, పండితులు సేవల ఎదుట శాస్ర్తోక్తంగా పాశురాలను పఠించారు. సాయంకాలం నిత్యారాధనల అనంతరం దివ్య ప్రబంధాన్ని పారాయణికులు పఠిస్తూ పురప్పాట్ సేవను నిర్వహించారు. స్వామివారి సేవను ఆలయంలో బాజాభజంత్రీలతో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆళ్వారులు కీర్తించిన ప్రబంధాల్లో పాశురాలను అనుసంధానం చేశారు. ప్రత్యేక రుత్వికులు, పండితులు సేవల ఎదుట శాస్ర్తోక్తంగా పాశురాలను పఠించారు. వేడుకల్లో ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.